G20 summit | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): జీ20 శిఖరాగ్ర సమావేశాల నేపథ్యంలో రోడ్లపై వీధిబాలలు కనిపించకుండా, తగిన చర్యలు తీసుకోవాలని రాష్ర్టాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. భారత్ నాయకత్వంలో మన దేశంలో జీ20 శిఖరాగ్ర సమావేశాలు సెప్టెంబర్లో జరుగనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విదేశీ ప్రతినిధులు ఎక్కువ సంఖ్యలో దేశంలోని వివిధ ప్రాంతాలను సందర్శిస్తున్నారని, వీధి బాలలు వారి కంట పడకుండా అన్ని చర్యలూ తీసుకోవాలని, జాతీయ బాలల హక్కుల కమిషన్ చైర్మన్ ప్రియాంకా కనూంగో రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాశారు.
వీధి బాలల్ని వారి తల్లిదండ్రుల వద్దకు పంపించాలని, లేదా పునరావాస కేంద్రాల్లో చేర్చాలని సూచించారు. వీధి బాలల పునరావాసంపై సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాలను లేఖతో జతచేశారు. ఈ నెలాఖరు వరకు జిల్లాల వారీగా రెస్క్యూ ఆపరేషన్స్ చేపట్టేందుకు తీసుకోబోయే చర్యల తాలూకు క్యాలెండర్ను కూడా అందించాలని కోరారు. నిరాశ్రయులు, అనాథలు, పాఠశాలకు వెళ్లని పిల్లలు, భిక్షమెత్తుకుంటూ జీవనం సాగించే పిల్లల హాట్స్పాట్లను గుర్తించాలని, అక్కడి నుంచి వారిని తరలించాలని ఆ లేఖలో కోరారు. ఈ లేఖపై స్వచ్ఛంద సంస్థలు మండి పడుతున్నాయి.
4 లక్షల మందికిపైగా యాచకులు..
జనాభా లెక్కల ప్రకారం దేశంలో 4.13 లక్షల మంది యాచకులు ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. అందులో 61 వేలకు పైగా పిల్లలున్నారు. అత్యధికంగా బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లోనే 15 వేలకు పైగా బాల యాచకులున్నారు. రెండో స్థానంలో రాజస్థాన్( 9 వేలు),ఆ తరువాత బీహార్, బెంగాల్ (5 వేలకు పైగా)రాష్ర్టాల్లో బాల యాచకులు వీధుల్లో తిరుగుతున్నారని ఓ రిపోర్టు వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ చర్యలను బాలల హక్కుల ఉద్యమకారులు తప్పుబడుతున్నారు. విదేశీ ప్రతినిధుల ముందు గొప్పలకు పోతున్నదని విమర్శించారు. వీధి బాలలందరికీ పునరావాసం కల్పించి, వారిని పాఠశాలల్లో చేర్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
వాస్తవాల్ని దాచేందుకే..
అప్పుడప్పుడు రెస్క్యూ ఆపరేషన్లతో పెద్దగా ఉపయోగం ఉండదు. వీధి బాలలు కనిపించకుండా వాస్తవ పరిస్థితులను దాయటానికే ఇలాంటి తాత్కాలిక చర్యలు తీసుకుంటున్నారు.
–నిర్మల్ గోరానా, సామాజిక కార్యకర్త, నిర్భంధ కార్మిక నిర్మూలన కమిటీ ప్రచార కన్వీనర్