న్యూఢిల్లీ, ఆగస్టు 16: ఎన్నికల సమయంలో ఉచిత హామీలను నియంత్రించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సవాల్ చేస్తూ తమిళనాడులోని అధికార డీఎంకే మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఉచిత పథకాలు అనే అంశం చాలా విస్తృతమైనదని, ఇం దులో అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 38 కింద సామాజిక క్రమాన్ని, ఆర్థిక న్యాయాన్ని కాపాడే లక్ష్యంతో సంక్షేమ పథకాల ద్వారా ఉచిత సేవలు అందించడం జరుగుతుందని పేర్కొన్నది.
రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలనే కేవలం ఉచితాలుగా చూపడం తగదని స్టాలిన్ పార్టీ పేర్కొన్నది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విదేశీ కంపెనీలకు ట్యాక్స్ హాలిడేలు ఇస్తున్నదని, అదేవిధంగా కార్పొరేట్లు, పారిశ్రామికవేత్తలు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను మాఫీ చేస్తున్నదని, అనుకూల వ్యక్తులకు కీలకమైన ప్రభుత్వ కాంట్రాక్టులు అప్పగిస్తున్నదని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చిన డీఎంకే.. వీటిని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నది. ఎన్నికల సమయంలో ఉచిత హామీలను అడ్డుకోవాలని కోరు తూ బీజేపీ నేత అశ్విని ఉపాధ్యాయ్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ఆద్మీపార్టీ ఇప్పటికే సవాల్ చేసింది.