న్యూఢిల్లీ, డిసెంబర్ 4: కరోనా కొత్త రూపం ‘ఒమిక్రాన్’ భారత్ను కలవరపెడుతున్నది. ఈ వేరియంట్కు సంబంధించి ఇప్పటికే కర్ణాటకలో రెండు కేసులు నమోదవ్వగా, శనివారం మరో రెండు కేసులు రికార్డయ్యాయి. గుజరాత్లోని జామ్నగర్లో ఒకటి, ముంబైలో మరో కొత్త వేరియంట్ కేసు నమోదైనట్టు అధికారులు తెలిపారు. జింబాబ్వే నుంచి ఈ నెల 2న వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్గా తేలిందని, జన్యుక్రమ విశ్లేషణ కోసం నమూనాలను ల్యాబ్కు పంపించగా ఒమిక్రాన్ నిర్ధారణ అయిందని గుజరాత్ హెల్త్ కమిషనర్ జయ్ ప్రకాశ్ శివహరే తెలిపారు. దక్షిణాఫ్రికా నుంచి గత నెల 23న ఢిల్లీకి, ఆ తర్వాత ముంబైకి వచ్చిన మరో వ్యక్తికి కరోనా పాజిటివ్గా తేలిందని, నమూనాలను విశ్లేషించగా ఒమిక్రాన్గా నిర్ధారణ అయిందని ముంబై అధికారులు తెలిపారు. ప్రస్తుతం బాధితులిద్దరినీ ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు వెల్లడించారు. దేశంలోని పలు జిల్లాల్లో వీక్లీ పాజిటివిటీ రేటు, వీక్లీ డెత్స్, వైరస్ వ్యాప్తిలో పెరుగుదల నమోదవుతుండటంతో కేంద్రప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ క్రమంలో కర్ణాటక, కేరళ, తమిళనాడు, జమ్ముకశ్మీర్, ఒడిశా, మిజోరానికి శనివారం లేఖలు రాసింది. ‘పరీక్షలు-నిఘా-చికిత్స-వ్యాక్సిన్-కొవిడ్ నిబంధనలు’ సరిగ్గా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. బూస్టర్ డోసు ఇవ్వడంపై మరింత శాస్త్రీయ అధ్యయనం చేయాల్సి ఉన్నదని ఇన్సాకాగ్ పేర్కొంది. దేశంలో 40 ఏండ్ల వారికి బూస్టర్ డోసు ఇవ్వాలని శుక్రవారం కేంద్రానికి సిఫారసు చేసిన ఇన్సాకాగ్.. తాజాగా ఈ ప్రకటన చేయడం గమనార్హం.
వ్యాక్సిన్ల సామర్థ్యాన్ని విశ్లేషించండి
దేశంలో ఒమిక్రాన్ భయాలు నెలకొన్న నేపథ్యంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ల సామర్థ్యాన్ని విశ్లేషించాల్సిన అవసరమున్నదని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ (హెల్త్) కేంద్రప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు ఓ నివేదికను సమర్పించింది. రోగనిరోధకశక్తి నుంచి కొత్త వేరియంట్ సులభంగా తప్పించుకుంటున్నదన్న నివేదికలను ఉటంకిస్తూ.. ఈ అంశంపై లోతుగా పరిశోధన చేయాల్సి ఉన్నదని, ప్రజలకు బూస్టర్ డోసు ఇవ్వడంపైనా త్వరగా నిర్ణయం తీసుకోవాలని సిఫారసు చేసింది. తగిన వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో కొవిడ్ సెకండ్వేవ్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేసింది. దవాఖానలో పడకలు, ఆక్సిజన్ సరఫరా సిలిండర్లు, ఔషధాలను తగిన మోతాదులో సిద్ధం చేయాలన్నది.