న్యూఢిల్లీ: మోసపూరిత, తప్పుదోవ పట్టించే ప్రకటనల విషయంలో ప్రచారం చేసిన సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొన్నది. పతంజలి తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసును జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ అమానుల్లా ధర్మాసనం మంగళవారం విచారించింది.
తప్పుదోవ పట్టించే ప్రకటనల నియంత్రణ, సమర్థన-2022 నిబంధనల్లోని 13వ నిబంధనల ప్రకారం ఏదైనా వస్తువు లేదా సేవలను ప్రచారం చేసేటప్పుడు వాటి గురించి ప్రచారం చేసే వ్యక్తికి పూర్తి సమాచారం ఉండాలని, మోసపూరిత ప్రకటనలు కాదని నిర్ధారించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నది. మార్కెట్ నుంచి కొనే వస్తువులు, ముఖ్యంగా ఆహారం, ఆరోగ్యానికి సంబంధించిన వాటిపై వినియోగదారులకు అవగాహన ఉండాలని ఈ నిబంధనలు రూపొందించారని కోర్టు తెలిపింది.