న్యూఢిల్లీ: తొలి దశలో ఎన్నికల్లో ‘మొదటి ఓటు నాదే కావాలి’ అని ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ బూత్లకు తరలి వచ్చారు! మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్ కే సంగ్మా కూడా అదే ఉత్సాహంతో తురాలోని పోలింగ్ కేంద్రానికి ఉదయం 6.30 గంటలకే చేరుకున్నారు. కానీ అప్పటికే చాలా మంది అక్కడ బారులు తీరి ఉండటాన్ని చూసి, ఆయన ఆశ్చర్యపోయారు. దీనిపై ఆయన స్పందిస్తూ, మొదటి ఓటు తనదే కావాలని కోరుకున్నానని, కానీ ఓటర్లు తన కన్నా ముందే బూత్కు చేరుకున్నారని, ఇది మంచి పరిణామమేనని చెప్పారు.
క్యూలో నిల్చొని ఓటేసిన రిటర్నింగ్ అధికారి
జమ్మూ-కశ్మీర్లోని ఉధంపూర్ లోక్సభ నియోజకవర్గంలో ఆసక్తికర ఘటన జరిగింది. రిటర్నింగ్ అధికారి రాకేశ్ మిన్హాస్ కఠువా పట్టణంలోని పోలింగ్ బూత్ వద్ద క్యూలో నిల్చొని ఓటు వేశారు.
నడిచొచ్చి ఓటేసిన 102 ఏండ్ల బామ్మ
తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో 102 ఏళ్ల వృద్ధురాలు చిన్నమ్మాళ్ తన ఓటు హక్కును వినియోగించుకొని స్ఫూర్తిగా నిలిచారు. కొన్నిచోట్ల నవ వధూవరులు పెండ్లి అయ్యాక నేరుగా పోలింగ్ కేంద్రానికి చేరుకొని తమ ఓటు హక్కు వినియోగించుకొన్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్ దంపతులు, ఆధ్యాత్మిక వేత్త జగ్గీ వాసుదేవ్, తమిళ సినీ ప్రముఖులు, ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళ ఆమ్గే తదితరులు తమ ఓటు హక్కు వినియోగించుకొన్నారు.
డబ్బు పంచుతూ పట్టుబడిన బీజేపీ నేత
మధ్యప్రదేశ్లోని చింద్వారాలో ఓటర్లకు డబ్బు పంచుతూ బీజేపీ నగర శాఖ అధ్యక్షుడు అంకుర్ శుక్లా కెమెరాకు చిక్కారు. ఈ వీడియోను కాంగ్రెస్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది.