న్యూఢిల్లీ, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): అంబేద్కర్ చూపిన బాటలోనే తెలంగాణ పయనిస్తున్నదని, తరతరాలుగా సామాజిక, ఆర్థిక వివక్షకు గురవుతున్న ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నదని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి డాక్టర్ మందా జగన్నాథం పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని తెలంగాణభవన్లో శుక్రవారం నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఆయన మాట్లాడుతూ.. దళితులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన అంబేద్కర్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం పండుగలా నిర్వహిస్తున్నదని చెప్పారు.
తెలంగాణ నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం, హుస్సేన్సాగర్ తీరంలో 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పడం దళితుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి గల ప్రేమకు నిలువెత్తు నిదర్శమని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణభవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, తెలంగాణ భవన్ అధికారి సంగీత, ఉద్యోగుల సంఘం నేత పద్మాచారి తదితరులు పాల్గొన్నారు.