న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) శుక్రవారం కేవలం హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను మాత్రమే ప్రకటించింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకపోవడంపై సర్వత్రా సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో సీఈసీ దీనిపై వివరణ ఇచ్చింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించకపోవడంలో ఎలాంటి నిబంధనలను ఉల్లంఘించలేదని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. గత ప్రాధాన్యతను అనుసరించినట్లు ఆయన చెప్పారు.
హిమాచల్ అసెంబ్లీ టెర్మ్ 2023 జనవరి 8న, గుజరాత్ అసెంబ్లీ టెర్మ్ 2023 ఫిబ్రవరి 18న ముగుస్తాయని రాజీవ్ కుమార్ తెలిపారు. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల అసెంబ్లీలు ముగియడానికి సుమారు 40 రోజుల గ్యాప్ ఉందని చెప్పారు. నిబంధనల ప్రకారం ఒక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితం మరొక దానిపై ప్రభావం చూపకుండా ఉండాలంటే కనీసం 30 రోజులు గ్యాప్ ఉండాలని అన్నారు. అందుకే హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ముందుగా ప్రకటించినట్లు చెప్పారు. అలాగే అక్కడి వాతావరణం కూడా ఒక కారణమని అన్నారు. శీతాకాలం ప్రారంభానికి ముందే హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియను ముగించాలని భావించామని ఇందులో భాగంగా ఆ రాష్ట్రానికి సంబంధించిన షెడ్యూల్ను తొలుత ప్రకటించినట్లు వివరించారు.
కాగా, ఈసీ షెడ్యూల్ ప్రకారం హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఒకే విడతలో నవంబర్ 12న జరుగనున్నాయి. అయితే సుమారు నెల తర్వాత డిసెంబర్ 8న ఫలితాలు వెల్లడిస్తారు. ఈ నేపథ్యంలో నెల రోజుల గ్యాప్పై సీఈసీ రాజీవ్ కుమార్ను మీడియా ప్రశ్నించింది. అలాగే రాష్ట్రాల అసెంబ్లీ పదవీ కాలం ఆరు నెలల వ్యవధిలో ముగిసే సందర్భంలో ఆయా రాష్ట్రాలన్నింటికి కలిపి ఒకేసారి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి ఒకే రోజున ఫలితాలు వెల్లడించడాన్ని గుర్తు చేసింది.
అయితే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ విధానాన్ని సీఈసీ పాటించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం కావడంతో గుజరాత్ ఎన్నికల అంశంలో ఈసీ అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అలాగే హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ప్రభావం గుజరాత్పై పడకుండా ఉండేలా ఈసీ వ్యవహరిస్తున్నదని విమర్శించాయి.