న్యూఢిల్లీ, మార్చి 16: ప్రజాస్వామ్యంలో దాపరికానికి తావు లేదని, ప్రజాస్వామ్యం అంటేనే ప్రజలకు అన్ని విషయాలు తెలియజేయడమని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ పారదర్శకత కోసమే తామంతా ఉన్నట్టు పేర్కొన్నారు. ఎలక్టోరల్ బాండ్ల విషయమై అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా స్పందించారు. ఎలక్టోరల్ బాండ్ల విషయంలో తాము పారదర్శకత వైపే నిలిచినట్టు ఆయన తెలిపారు.
అమెరికాలోలాగా విరాళాల మొత్తాలను రాజకీయ పార్టీలు బహిర్గతం చేసేలా చేయొచ్చా అని అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ… అందుకు సంస్థాగత యంత్రాంగం పరిష్కారం వెతకాలని, అయితే విరాళం ఇచ్చిన దాతలు వేధింపులకు గురి కాకుండా వారి గోప్యతను కూడా కాపాడాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి రాజకీయ పార్టీ ఎంత విరాళం పొందిందో, ఎన్నికల్లో ఎంత ఖర్చు చేసిందో వివరాలు వెల్లడిస్తూ వార్షిక అకౌంట్ అందించడాన్ని ఈసీ తప్పనిసరి చేసిందన్నారు.