న్యూఢిల్లీ: గత నెలలో తమిళనాడులో ఆర్మీ హెలీకాప్టర్ కూలడంతో చనిపోయిన సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ సోదరుడు కల్నల్ విజయ్ రావత్ (రిటైర్డ్) బీజేపీలో చేరారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సమక్షంలో బుధవారం ఢిల్లీలో ఆ పార్టీ సభ్యత్వం స్వీకరించారు. దీనికి ముందు ఆయనను విజయ్ రావత్ కలిశారు. ఉత్తరాఖండ్ సీఎం విజన్ తనకు నచ్చిందని అన్నారు. తన సోదరుడు (దివంగత బిపిన్ రావత్)తోపాటు తన మనసులో ఉన్నదానికి ఈ విజన్ సరిపోలుతుందని చెప్పారు. బీజేపీది కూడా అదే ఆలోచన అని ఆయన వ్యాఖ్యానించారు.
దీంతో రావత్ సోదరుడు విజయ్, బీజేపీలో చేరుతున్నట్లుగా ఊహాగానాలు వెలువడ్డాయి. ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయవచ్చని పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి. కాగా, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామిని ఢిల్లీలో కలిసిన విజయ్ రావత్ కూడా దీనిపై స్పష్టత ఇచ్చారు. “వారు (బీజేపీ) నన్ను అడిగితే, ఉత్తరాఖండ్ ప్రజలకు నేను సేవ చేస్తాను” అని తెలిపారు. 70 స్థానాల ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 14న జరుగనున్నాయి.
మరోవైపు, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి కూడా రావత్ కుటుంబం దేశానికి చేసిన సేవకు సెల్యూట్ చేస్తూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. “ఈరోజు ఢిల్లీలో, దేశంలోని మొదటి సీడీఎస్ సోదరుడు, ఉత్తరాఖండ్కు చెందిన దివంగత బిపిన్ రావత్ జీకి గర్వకారణమైన కల్నల్ విజయ్ రావత్ జీని కలిశాను. బిపిన్ రావత్, ఆయన కుటుంబం దేశానికి చేసిన సేవకు నేను సెల్యూట్ చేస్తున్నా. వారి కలలకు అనుగుణంగా ఉత్తరాఖండ్ను తీర్చిదిద్దేందుకు నేను ఎల్లప్పుడూ కృషి చేస్తాను” అని పుష్కర్ సింగ్ ధామి పేర్కొన్నారు.