పుణె : భారతదేశ ఉత్తర సరిహద్దుల్లో చైనా బలగాల మోహరింపు కొనసాగడం సవాలేనని, అయితే ఎల్వోసీపై మన చట్టబద్ధతను కొనసాగించడానికి మన దేశ బలగాలు కట్టుబడి ఉన్నాయని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ పేర్కొన్నారు. మంగళవారం పుణెలో జరిగిన నేషనల్
డిఫెన్స్ అకాడమీ 144వ కోర్సు పాసింగ్ ఔట్ పరేడ్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ…
సరిహద్దుల్లో చైనా బలగాల మోహరింపు రోజురోజుకూ పెరగడం లేదని, అయితే 2020 నాటి స్థాయిలోనే ఆ దేశ బలగాలు ఉన్నాయని తెలిపారు. ఇది ఒక సవాల్ లాంటిదేనని, ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా మన బలగాలు అన్ని చర్యలూ తీసుకుంటున్నట్టు చెప్పారు. డెంచోక్, డెప్సాంగ్ తప్ప మిగతా అన్ని ప్రాంతాలను మన ఆధీనంలోకి తీసుకోగలిగామని వెల్లడించారు. చర్చలు కొనసాగుతున్నాయని, సానుకూల ఫలితాలు ఉంటాయని ఆశిస్తున్నట్టు తెలిపారు.