న్యూఢిల్లీ: రాజ్యసభ ( Rajya Sabha ) లో మంగళవారం జరిగిన ఘర్షణకు సంబంధించిన సీసీటీవీ ఫూటేజ్ను ఇవాళ రిలీజ్ చేశారు. అయితే విధుల్లో ఉన్న సెక్యూర్టీ దళాలపై విపక్ష సభ్యులు దూసుకువెళ్లినట్లు ఆ వీడియోలో ఉన్నది. దీనికి సంబంధించిన 2.50 నిమిషాల వీడీయోను బయటపెట్టారు. సభలో నినాదాలు చేస్తున్న ఎంపీలు.. యూనిఫామ్లో ఉన్న మార్షల్స్ ఆ వీడియోలో కనిపించారు. చైర్ వైపు దూసుకువస్తున్న ఎంపీలను మార్షల్స్ అడ్డుకున్నారు. ఇక ప్రతిపక్ష ఎంపీలు పేపర్లను చించేసి గాల్లోకి విసిరేసిన దృశ్యాలు కూడా ఆ సీసీటీవీలో కనిపిస్తున్నాయి. ఓ ఎంపీ టేబుల్ ఎక్కుతున్న దృశ్యాలు కూడా దాంట్లో ఉన్నాయి. ప్రభుత్వం రెండు రోజుల ముందే పార్లమెంట్ను రద్దు చేసిందని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ వీడియోను రిలీజ్ చేశారు. పార్లమెంట్ సెక్యూర్టీలో లేని వారిని కూడా తీసుకువచ్చి తమల్ని అడ్డుకున్నట్లు ఎంపీలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో రాజ్యసభ వీడియోను రిలీజ్ చేశారు.