హైదరాబాద్: కరోనా వైరస్ డబుల్ వేరియంట్ B.1.617 దడపుట్టిస్తున్నది. ప్రస్తుతం గత నాలుగు రోజుల నుంచి దేశంలో సగటున రెండు లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. అయితే సెకండ్ వేవ్ ఇంత ఉదృతంగా మారడాకిని B.1.617 వేరియంటే కారణమా అన్న కోణంలో పరిశోధనలు సాగుతున్నాయి. హైదరాబాద్కు చెందిన సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ(సీసీఎంబీ) సంస్థ ఆ వేరియంట్ను అధ్యయనం చేసేందుకు ప్రయత్నిస్తోంది. డబుల్ వేరియంట్ -B.1.617ను డీకోడ్ చేయనున్నది. ఆ కొత్త రకం కరోనా జన్యు క్రమాన్ని స్టడీ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల నుంచి సేకరించిన శ్యాంపిళ్లతో జీనోమ్ సీక్వెన్సింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ శ్యాంపిళ్ల ఫలితాలు రెండు వారాల్లోగా రానున్నాయి.
ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ విజృంభించడానికి కారణం కొత్త వేరియంట్ కాదా అవునా అన్న ఉద్దేశంతో అధ్యయనం చేపట్టినట్లు సీసీఎంబీ డైరక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. ఆ వేరియంట్ పరివర్తనం చెందుతుందా అన్న కోణంలోనూ స్టడీ చేయనున్నారు. ఇతర వేరియంట్ల కన్నా.. -B.1.617 మరింత ప్రమాదకరంగా వ్యాప్తి చెందుతుందా అన్న విషయంలో తమ వద్ద ఆధారాలు లేవని డాక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. కానీ ఈ కొత్త వేరియంట్ను డబుల్ మ్యూటెంట్ అని పిలవలేమని, ఎందుకంటే ఆ వేరియంట్లో E484Q, L452Rతో పాటు ఇతర మ్యుటెంట్లు ఉన్నట్లు తెలిపారు.
B.1.617 కరోనా వేరియంట్లో రెండు మ్యుటేషన్లు ఉన్నట్లు గుర్తించామన్నారు. E484Q, L452R మ్యుటెంట్లను పసికట్టామన్నారు. సాధారణంగా వైరస్లు సహజసిద్దమైన రీతిలో పరివర్తనం చెందుతుంటాయని, ఈ క్రమంలో కొన్ని బలహీనపడుతుంటాయని, కొన్ని బలంపుంజుకుంటాయన్నారు. బలపడిన ముట్యెంట్లు వేగంగా వ్యాప్తి చెందుతాయని డాక్టర్ రాకేశ్ తెలిపారు. మహారాష్ట్రకు చెందిన 50 శాతం శ్యాంపిళ్లను పరిశీలిస్తే.. వాటి జన్యువుల్లో B.1.617 వేరియంట్ ఉన్నట్లు గుర్తించామన్నారు. ఆంధ్రప్రదేవ్, తెలంగాణ, కేరళ కేసుల్లోనూ ఈ వేరియంట్ ఉన్నట్లు ఆయన తెలిపారు. పంజాబ్ శ్యాంపిళ్లలో మాత్రం యూకే వేరియంట్ B.1.17 ను గుర్తించినట్లు చెప్పారు.
కొత్త వేరియంట్లపై ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు పని చేస్తాయా లేదా విషయాన్ని అధ్యయనం చేయనున్నట్లు సీసీఎంబీ చెప్పింది. దీని కోసం E484Q, L452R రెండు వేరియంట్లను కల్చర్ చేస్తున్నారు. ఈ రెండు వేరియంట్లు కలవడం వల్ల.. కరోనా వైరస్ ప్రాణాంతకంగా మారిందా లేదా అన్న అంశాన్ని తేల్చుతామన్నారు. ఎక్కువ స్థాయిలో శ్యాంపిళ్లను కల్చర్ చేసి.. వాటి జన్యువులను సీక్వెన్స్ చేస్తే క్లారిటీ వస్తుందని డాక్టర్ మిశ్రా తెలిపారు. దేశంలో 80 శాతం కోవిడ్ కేసులు పెరగడానికి ప్రజల నిర్లక్ష్య ప్రవర్తనే కారణమన్నారు.