న్యూఢిల్లీ : సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 12వ తరగతి ఫలితాలు ( CBSE 12th Results ) విడుదలయ్యాయి. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు సీబీఎస్ఈ అధికారులు ఫలితాలను విడుదల చేశారు. ఈ సారి సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో గతంలో ఎన్నడూ లేనంతగా పాస్ పర్సంటేజ్ నమోదయ్యింది. మొత్తం 13,04,561 మంది విద్యార్థులు సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల కోసం రిజస్టర్ కాగా, వారిలో 12,96.318 మంది ఉత్తీర్ణత సాధించారు. అంటే ఓవరాల్గా 99.37 శాతం ఉత్తీర్ణ నమోదైంది.
అయితే, బాలుర కంటే బాలికలు మెరుగైన ఫలితాలు సాధించారు. బాలురులో 99.13 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, బాలికలు 99.67 శాతం మంది పాసయ్యారు. అంటే బాలుర కంటే బాలికలు 0.54 శాతం ఎక్కువగా ఉత్తీర్ణులయ్యారు. విద్యార్థులు తమ ఫలితాలను cbseresults.nic.in వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చని బోర్డు అధికారులు తెలిపారు. కాగా, సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల కోసం విద్యార్థులు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. ఫలితాలు మరీ ఆలస్యం కావడంతో సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకుంది.
జూలై 31లోపు ఫలితాలను ప్రకటించాలని గతంలోనే సీబీఎస్ఈ బోర్డును సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు సీబీఎస్ఈ అధికారులు ఇవాళ ఫలితాలను వెల్లడించారు. అయితే, ఈసారి పరీక్షల నిర్వహణ సాధ్యం కాకపోవడంతో 10, 11వ తరగతి, ప్రీ బోర్డు పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా ఫలితాలను నిర్ణయించారు. 10వ తరగతి పరీక్షలకు 30 శాతం, 11వ తరగతి పరీక్షలకు 40 శాతం, 12వ తరగతి యూనిట్, మిడ్ టర్మ్, ప్రీ బోర్డు పరీక్షలకు 30 శాతం వెయిటేజీ ఇస్తూ 12వ తరగతి తుది ఫలితాలను వెల్లడించారు.