Manish Sisodia | తన బ్యాంకు లాకర్పై మంగళవారం కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దాడి చేస్తుందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఆరోపించారు. నూతన ఎక్సైజ్ పాలసీ అమలులో అవినీతికి పాల్పడిందన్న అంశంపై దర్యాప్తులో భాగంగా బ్యాంక్ లాకర్ను సీబీఐ తనిఖీ చేయనున్నదని చెప్పారు. అందుకు సీబీఐకి స్వాగతం పలుకుతున్నట్లు సోమవారం చెప్పారు. ఈ మేరకు మనీశ్ సిసోడియా ట్విట్టర్ వేదికగా స్పందించారు. `రేపు నా బ్యాంక్ లాకర్పై దాడి చేయడానికి సీబీఐ వస్తోంది. ఈ నెల 19న 14 గంటలపాటు నా ఇంట్లో జరిగిన సోదాల్లో ఏమీ దొరకలేదు. లాకర్లోనూ ఏమీ దొరకదు. సీబీఐకి స్వాగతం పలుకుతున్నా. ఈ కేసు దర్యాప్తులో నేను, నా కుటుంబం పూర్తిగా సహకరిస్తాం` అని ట్వీట్ చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాతోపాటు 15 మందిపై సీబీఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అభియోగాలు ఎదుర్కొంటున్న వారిలో ఎక్సైజ్ శాఖ అధికారులు, లిక్కర్ కంపెనీల ఎగ్జిక్యూటివ్లు, డీలర్లు, గుర్తు తెలియని ప్రభుత్వోద్యోగులు, ప్రైవేట్ వ్యక్తులపై కేసు నమోదు చేసింది సీబీఐ.
ఢిల్లీలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ని చీల్చేందుకు, ఆప్ నుంచి తాను వైదొలిగేలా ఒత్తిడి చేసేందుకు ఈ దాడులు జరుగుతున్నాయని సిసోడియా ఆరోపించారు. తనపై బీజేపీలో చేరేందుకు ఒత్తిడి పెంచేందుకు ఈ దాడులని చెప్పారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ పూర్తిగా పారదర్శకంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. లిక్కర్ పాలసీలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలను తిరస్కరించారు.