చెన్నై: తమిళనాడులో 12వ తరగతి చదువుతున్న 17 ఏళ్ల అమ్మాయి సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ సంచలన కేసును సీబీఐ విచారించనున్నట్లు ఇవాళ మద్రాస్ హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. బలవంతంగా మతమార్పిడి జరిగినట్లు ఆ అమ్మాయి తల్లితండ్రులు ఆరోపిస్తున్నారు. హాస్టల్ వార్డెన్ వేధింపుల వల్ల తమ కూతురు చనిపోయినట్లు పేరెంట్స్ పేర్కొన్నారు. తాంజావూరులో జనవరి 9న ఇంట్లో విషం తీసుకుని అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడింది.
గత వారం ఆ టీనేజ్ అమ్మాయి ఓ వీడియోను రిలీజ్ చేసింది. వార్డెన్ వత్తిళ్ల వల్ల చదువులపై శ్రద్ధ పెట్టలేకపోతున్నట్లు చెప్పింది. రూమ్లు శుభ్రం చేయాలని, అకౌంట్లు చూడాలని, వార్డెన్ పనులన్నీ చేసి పెట్టాల్సి వస్తున్నట్లు ఆమె ఆ వీడియోలో తెలిపింది. దీని వల్ల చదువుల్లో తన గ్రేడింగ్ పడిపోతున్నట్లు ఆమె భయాందోళనలు వ్యక్తం చేసింది. క్రైస్తవ మతాన్ని స్వీకరించేందుకు తమ తల్లితండ్రులు వ్యతిరేకించడం వల్లే తనపై వేధింపులు ఎక్కువైనట్లు ఆ అమ్మాయి మరో వీడియోలో పేర్కొన్నది.
రెండు వీడియోలను విచారణ నిమిత్తిం పోలీసులకు అప్పగించారు. అయితే వీడియోలు తీసిన వ్యక్తిని వేధించవద్దు అని, కానీ దర్యాప్తుపై ఫోకస్ పెట్టాలని హైకోర్టు పోలీసులకు సూచించింది.