కోల్కతా: పశ్చిమబెంగాల్ వాణిజ్యశాఖ మాజీ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు పార్థా ఛటర్జి జ్యుడీషియల్ కస్టడీని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మరో 14 రోజులు పొడిగించింది. పశ్చిమబెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ (WBSSC) కుంభకోణానికి సంబంధించిన కేసులో గతంలో ఈడీ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను సీబీఐ స్పెషల్ కోర్టులో హాజరుపర్చగా జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. రిమాండ్ ముగియడంతో ఇప్పుడు మరో 14 రోజులు పొడిగించింది.
ఈ కేసులో మంత్రి పార్థతోపాటు ఆయన సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ, కొందరు మాజీ అధికారులు నిందితులుగా ఉన్నారు. అర్పిత ఇంట్లో ఈడీ అధికారులకు రూ.21 కోట్ల నగదు లభ్యమైంది. పార్థా ఛటర్జీ విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఈ కుంభకోణం జరిగింది. ఈ కేసులో అప్పటి ఆయన ఓఎస్డీ పీకే బందోపాధ్యాయ్, వ్యక్తిగత కార్యదర్శి సుకాంత ఆచార్జి కూడా నిందితులుగా ఉన్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న నిందితులందరికీ జ్యుడీషియల్ కస్టడీ కోర్టు పొడిగించింది.
అర్పిత ముఖర్జీ ఇంట్లో రూ.21 కోట్ల నగదుతో పాటు 20కిపైగా ఫోన్లను ఈడీ అధికారులు రికవరీ చేశారు. స్కామ్కు సంబంధించిన రికార్డులు,డ్యాక్యుమెంట్లు, కంపెనీల నకిలీ వివరాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, విదేశీ నగదు, బంగారాన్ని వేర్వేరు ప్రాంతాల్లో స్వాధీనం చేసుకున్నారు.