న్యూఢిల్లీ, మార్చి 16: ‘ల్యాండ్ ఫర్ జాబ్స్’ కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ను ఈ నెలలో అరెస్టు చేయమని సీబీఐ తెలిపింది. దీంతో ఈ నెల 25న ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరవుతానని తేజస్వీ యాదవ్ తెలిపారు. ఈ కేసులో సీబీఐ పలుసార్లు సమన్లు జారీ చేయడంతో తేజస్వీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
విచారణ పేరుతో పిలిచి అరెస్టు చేయడం సీబీఐకి అలవాటుగా మారిందని, ఇప్పటికే ఓ నిందితుడిని ఇలాగే అరెస్టు చేశారని తేజస్వీ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం సీబీఐ ముందు హాజరుకావడం కుదరదని తెలిపారు. దీంతో సీబీఐ తరఫు న్యాయవాది స్పందిస్తూ తేజస్వీని ఈ నెలలో అరెస్టు చేయబోమని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో స్పందించిన తేజస్వీ తరఫు న్యాయవాది ఈ నెల 25న సీబీఐ ముందు హాజరవుతారని తెలిపారు.