CBI Raids | విదేశీ నిధుల స్వీకరణ కేసులో స్వచ్ఛంద సంస్థలపై కేంద్రం కొరడా ఝుళిపించింది. దేశవ్యాప్తంగా 40 చోట్ల కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సోదాలు జరిపింది. విదేశీ విరాళాల స్వీకరణలో నిబంధనలు ఉల్లంఘించిన స్వచ్ఛంద సంస్థల నుంచి ముడుపులందుకున్న ఐదుగురు ప్రభుత్వ అధికారులతోపాటు 10 మందిని అరెస్ట్ చేసింది.
విదేశీ నిధుల స్వీకరణలో విదేశీ నిధుల నియంత్రణ చట్టం (ఎఫ్సీఆర్ఏ) ఉల్లంఘించిన వారికి క్లియరెన్స్ ఇవ్వడానికి కొందరు అధికారులు ముడుపులు స్వీకరించారని సీబీఐని ఉటంకిస్తూ హోంశాఖ వర్గాలు తెలిపాయి. అరెస్టయిన వారిలో హోంశాఖ అధికారులు, ఎన్జీవోల ప్రతినిధులు, మధ్యవర్తులు ఉన్నారని అధికార వర్గాల కథనం.
హవాలా లావాదేవీల ద్వారా రూ.2 కోట్లు చట్ట విరుద్ధంగా చేతులు మారినట్లు గుర్తించారు. ఢిల్లీ, రాజస్థాన్, చెన్నై, మైసూర్ తదితర ప్రాంతాల్లో సీబీఐ అధికారులు తనిఖీలు జరిపారు. హోంశాఖ నుంచి వచ్చిన సమాచారం మేరకు సీబీఐ ఈ సోదాలు జరిపింది.