పాట్నా, మార్చి 6: బీహార్ మాజీ సీఎం రబ్రీదేవిని సీబీఐ అధికారులు సోమవారం ఆమె నివాసంలో ప్రశ్నించారు. ఆమె భర్త, రైల్వే మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్కు సైతం నోటీసులు జారీ చేశారు. లాలూ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన ఉద్యోగ నియామకాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ప్రతిగా వారి నుంచి లాలూ, ఆయన కుటుంబసభ్యులు భూమలు తీసుకున్న కేసు(లాండ్ ఫర్ జాబ్)లో సీబీఐ ఇదివరకే కేసు నమోదు చేసింది. సీబీఐ ఇప్పటికే చార్జిషీట్ దాఖలు చేయగా లాలూ, కుటుంబసభ్యులు ఈ నెల 15న హాజరు కావాలని ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా, రబ్రీ దేవిని సీబీఐ ప్రశ్నించడాన్ని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తప్పుబట్టారు. విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాలపై బీజేపీ దర్యాప్తు సంస్థలతో దాడులకు దిగడం అలవాటుగా మారిందని విమర్శించారు.