Kejriwal | న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు సీబీఐ శుక్రవారం సమన్లు జారీచేసింది. ఈనెల 16న (ఆదివారం) ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు ఎన్నికల సంఘం జాతీయ పార్టీ హోదా కల్పించిన నాలుగు రోజులకే సీబీఐ నుంచి నోటీసులు రావడం ప్రాధాన్యం సంతరించుకొన్నది. ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను సీబీఐ ఈ ఏడాది ఫిబ్రవరిలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మనీశ్ సిసోడియా రిమాండ్ రిపోర్టులో సీబీఐ కేజ్రీవాల్ పేరును ప్రస్తావించింది. తాజాగా సాక్ష్యాలు సేకరించామని, సీఎం కేజ్రీవాల్ను ప్రశ్నించేందుకు తగిన ఆధారాలు ఉన్నాయని, అందుకే సమన్లు జారీచేసినట్టు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. ఇటీవలి కాలంలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఓ ముఖ్యమంత్రిని విచారణకు పిలవడం ఇదే తొలిసారి అని విశ్లేషకులు చెప్తున్నారు.
కేజ్రీవాల్ పోరాటాన్ని కేంద్రం అడ్డుకోలేదు
కేజ్రీవాల్కు సీబీఐ సమన్లు జారీచేయడంపై ఆప్ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. శుక్రవారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 16న కేజ్రీవాల్ను కూడా అరెస్టు చేసేందుకు కేంద్రంలోని మోదీ సర్కార్ కుట్రలు చేసిందని ఆరోపించారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. ప్రధాని మోదీకి, ఆయన స్నేహితుడు అదానీకి మధ్య ఉన్న సంబంధాలను ప్రశ్నించినందుకే కేంద్రం, దర్యాప్తు సంస్థలు కేజ్రీవాల్ను టార్గెట్గా చేసుకొన్నాయని, సీబీఐ సమన్లతో కేజ్రీవాల్ పోరాటాన్ని కేంద్రం ఆడ్డుకోలేదని సంజయ్ సింగ్ స్పష్టం చేశారు. ‘కేజ్రీవాల్ను అరెస్టు చేసి, జైలుకు పంపాలని అనుకొంటున్న మీ (బీజేపీ సర్కార్) కుట్రలు అవినీతికి వ్యతిరేకంగా ఆయన గొంతుకను అణచలేవు’ అని అన్నారు. ‘ఇటీవల కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీలో మాట్లాడుతూ ప్రధాని మోదీ స్నేహితుడి (అదానీ) నల్లధనం ప్రధాని నల్లధనమే అని పేర్కొన్నారు. తర్వాతి నంబర్ మీదే అని, దర్యాప్తు సంస్థలు త్వరలోనే మీ దగ్గరకు వస్తాయని నేను ఆ రోజునే కేజ్రీవాల్కు చెప్పాను. ప్రధాని అవినీతిని కప్పిపుచ్చేందుకు వారు ఏదైనా చేస్తారు’ అంటూ ప్రధాని మోదీపై విమర్శల దాడి చేశారు. దర్యాప్తు సంస్థల వలలో కేజ్రీవాల్ను లాగేందుకు మోదీ కొంతకాలంగా కుట్రలు చేస్తూనే ఉన్నారని అన్నారు. కాగా, ఆదివారం కేజ్రీవాల్ సీబీఐ విచారణకు హాజరవుతారని ఈ సందర్భంగా తెలిపారు.
దేశాభివృద్ధికి కొన్ని శక్తుల అడ్డంకులు
శుక్రవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా డీఎంసీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వ పెద్దలను ఉద్దేశించి మాట్లాడుతూ దేశంలో కొన్ని దేశ వ్యతిరేక శక్తులు ఉన్నాయని, దళితులు, బడుగు బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య అందడం వారికి ఇష్టం లేదని, అందుకే ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభివృద్ధికి ఎంతో కృషిచేస్తున్న మనీశ్ సిసోడియాను జైలుకు పంపించారని విమర్శించారు. ఈ దేశ వ్యతిరేక శక్తులు దేశం పురోగతి సాధించకూడదని కోరుకుంటున్నాయని, వీరంతా దేశానికి శత్రువులని విమర్శించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించాలని అంబేద్కర్ కలలు కన్నారని, అయితే గత 75 ఏండ్లలో దేశాన్ని పాలించిన వారు ప్రభుత్వ పాఠశాలలను నాశనం చేశారని, అందుకే ప్రైవేటు బడులు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయని పేర్కొన్నారు.
గోవా కేసులోనూ..
కేజ్రీవాల్కు మరో కేసులోనూ సమన్లు అందాయి. 2022 గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో ప్రభుత్వ ఆస్తులపై చట్టవిరుద్ధంగా పోస్టర్లు అంటించిన కేసులో గోవా పోలీసులు గురువారం ఆయనకు సమన్లు జారీచేశారు. ఈనెల 27న తమ ముందు విచారణకు హాజరుకావాలని కోరారు. ఆప్ కన్వీనర్కు పెర్నెం పోలీసుస్టేషన్ ఇన్స్పెక్టర్ దిలీప్కుమార్ సీఆర్పీసీలోని 41(ఏ) సెక్షన్ కింద ఈ నోటీసులు జారీచేశారు. కాగా, గోవా పోలీసుల ముందు తాను విచారణకు కచ్చితంగా హాజరవుతానని కేజ్రీవాల్ శుక్రవారం తెలిపారు. గోవాలో బీజేపీ అధికారంలో ఉన్నది. ఇక్కడ 2022 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన ఆప్ రెండు స్థానాలు గెలుచుకొన్నది.