భువనేశ్వర్: ఒడిశాలోని బాలాసోర్లో మూడు రైళ్లు ఢీకొన్న ప్రమాదంపై (Balasore train accident) దర్యాప్తు చేసిన సీబీఐ, ముగ్గురు రైల్వే ఉద్యోగులకు వ్యతిరేకంగా చార్జిషీట్ దాఖలు చేసింది. సీనియర్ ఇంజినీర్ అరుణ్ కుమార్ మహంతా, సెక్షన్ ఇంజినీర్ మహమ్మద్ అమీర్ ఖాన్, టెక్నీషియన్ పప్పు కుమార్లపై హత్య, సాక్ష్యాలు ధ్వంసం వంటి నేరపూరిత అభియోగాలు మోపింది. ఈ ముగ్గురు రైల్వే ఉద్యోగులను జూలైలో సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఐపీసీలోని 304, 201 సెక్షన్ల కింద వారిపై కేసు నమోదు చేశారు.
కాగా, జూన్ 2న బాలాసోర్లోని బహనాగా బజార్ రైల్వే స్టేషన్ వద్ద లూప్ లైన్లో ఆగి ఉన్న గూడ్స్ రైలును
కోరమాండల్ ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. దాని బోగీలు పక్కన ఉన్న పట్టాలపై పడ్డాయి. అదే సమయంలో వచ్చిన యశ్వంత్పూర్-హౌరా ఎక్స్ప్రెస్ వాటిని ఢీకొట్టి పట్టాలు తప్పింది. ఈ మూడు రైళ్ల ప్రమాదంలో సుమారు 290 మంది మరణించగా, వేలాది మంది గాయపడ్డారు. కాళ్లు, చేతులు కోల్పోయిన వందలాది మంది వికలాంగులుగా మారారు.
మరోవైపు ఈ మూడు రైళ్ల ప్రమాదం వెనుక విద్రోహ చర్య ఉండవచ్చని రైల్వే శాఖ అనుమానించింది. ఈ నేపథ్యంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సీబీఐ దర్యాప్తు కోరారు. రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు మూడు రైళ్ల ప్రమాదంపై దర్యాప్తు జరిపారు. మానవ తప్పిదమే ప్రధాన కారణమని తేల్చారు.
కాగా, బహనాగ బజార్ స్టేషన్ సమీపంలోని లెవెల్ క్రాసింగ్ గేట్ నంబర్ 94 వద్ద మరమ్మతు పనులను ఎల్సి గేట్ నంబర్ 79 సర్క్యూట్ రేఖాచిత్రాన్ని ఉపయోగించి సీనియర్ ఇంజినీర్ మహంత చేసినట్లు సీబీఐ పేర్కొంది. సిగ్నల్స్ నిర్వహణ, ఇంటర్లాకింగ్ ఇన్స్టాలేషన్లను పరీక్షించడం, సరిదిద్దడం, ఆమోదించిన ప్లాన్ ప్రకారం మార్పులు చేయడం వంటివి అతడి విధులు కాగా, ఆ మేరకు ఆయన చేయలేదని ఆరోపించింది.