బెంగళూరు, సెప్టెంబర్ 26: తమిళనాడు, కర్ణాటక మధ్య కావేరీ జలాల వివాదం ముదురుతున్నది. తమిళనాడుకు కావేరీ జలాల విడుదలను వ్యతిరేకిస్తూ కర్ణాటక జల సంరక్షణ సమితి బెంగళూరు నగర బంద్ కార్యక్రమం చేపట్టింది. కురుబురు శాంతకుమార్ నేతృత్వంలో జరిగిన ఈ బంద్లో రాష్ర్టానికి చెందిన రైతు, ఇతర సంఘాలు పాల్గొన్నాయి. తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేయొద్దని, కరువు కాలంలో పరిస్థితులను అంచనా వేయడానికి ఈసీ వంటి ఒక సంస్థను ఏర్పాటు చేయాలని, మేకదాతు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ప్రాజెక్టును అమలు చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. సుమారు 1000 మంది ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రభుత్వం మూడు రోజుల్లోగా ఓ నిర్ణయాన్ని ప్రకటించాలని శాంత కుమార్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం సరైన రీతిలో స్పందించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నగరంలోని సాధారణ జనజీవనంపై బంద్ ప్రభావం పడింది. నగరంలోని విద్యాసంస్థలు, దుకాణాలు మూతపడ్డాయి. సెప్టెంబర్ 13 నుంచి 15 రోజుల పాటు తమిళనాడుకు రోజుకు 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ(సీడబ్ల్యూఎంఏ) కర్ణాటక ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయంలో కలుగజేసుకొనేందుకు ఈనెల 21న సుప్రీంకోర్టు తిరస్కరించింది.
జల వివాదంపై ‘కన్నడ ఒక్కుత’ సంఘం శుక్రవారం రాష్ట్రవ్యాప్త బంద్కు పిలుపునిచ్చింది. మంగళవారం నాటి బంద్కు రాష్ట్రంలోని ప్రతిపక్షాలు మద్దతు పలికాయి. కావేరీ జలాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్న ప్రతిపక్షాల ఆరోపణలను సీఎం సిద్ధరామయ్య ఖండించారు. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణలో తమ ప్రభుత్వానికి రాజీ లేదని పేర్కొన్నారు. కాగా, ఆందోళనలతో సంబంధం లేకుండా సుప్రీంకోర్టు తీర్పుకు కట్టుబడి ఉండాలని తమిళనాడు జలవనరుల శాఖ మంత్రి దురైమురుగన్ చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు.