న్యూఢిల్లీ, డిసెంబర్ 4: రోడ్డు ప్రమాద బాధితులకు దేశవ్యాప్తంగా నగదు రహిత వైద్య చికిత్స సదుపాయాన్ని కల్పించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. మూడు నుంచి నాలుగు నెలల్లోగా ఈ సదుపాయం అందుబాటులోకి రావచ్చని కేంద్ర రవాణా, రహదారుల శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్ సోమవారం వెల్లడించారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాఫిక్ ఎడ్యుకేషన్ (ఐఆర్టీఈ) ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిస్తూ.. రోడ్డు ప్రమాదాల వల్ల ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాల్లో అత్యధికం భారత్లోనే నమోదవుతున్నాయని గుర్తుచేశారు. సవరించిన మోటర్ వాహన చట్టం-2019లో భాగంగా ప్రమాద బాధితులకు నగదు రహిత వైద్య చికిత్స సదుపాయాన్ని కల్పించనున్నట్టు తెలిపారు. ఇప్పటికే కొన్ని రాష్ర్టాలు దీన్ని అమలు చేస్తున్నాయని, ఇప్పుడు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో కలిసి రహదారుల శాఖ దేశవ్యాప్తంగా పూర్తిస్థాయిలో దీన్ని అమలు చేయనున్నదని వివరించారు.