న్యూఢిల్లీ: జాతీయ రహదారులపై గల టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులపై నిషేధం విధించేందుకు కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ సన్నాహాలు చేస్తున్నది. విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. వాహనదారులు టోల్ చెల్లించేందుకు ఫాస్టాగ్ లేదా యూపీఐని ఉపయోగించవలసి ఉంటుంది. రోడ్లపై వాహనాలు బారులు తీరి ఉండటాన్ని నిరోధించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అధికారికంగా వెలువడలేదు. గడువు సమీపిస్తుండటంతో డిజిటల్ చెల్లింపులకు మారేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని వాహనదారులకు సలహా ఇస్తున్నారు. ఫాస్టాగ్ లేదా యూపీఐ చెల్లింపుల విధానం వల్ల ప్రయాణాలు వేగవంతమవుతాయి, ఇంధనం ఆదా అవుతుంది. పారదర్శకత వస్తుంది. చిల్లర లేదా రశీదుల కోసం వేచి ఉండవలసిన అవసరం ఉండదు. మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో సిస్టమ్కు ఇది తొలి అడుగు. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్ట్ దేశవ్యాప్తంగా 25 టోల్ ప్లాజాల వద్ద అమల్లో ఉంది.