లక్నో: పోలీసుల ఎన్కౌంటర్లో ఒక వ్యక్తి మరణించాడు. దీనిపై మృతుడి భార్య కోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన కోర్టు ఎన్కౌంటర్లో పాల్గొన్న 12 మంది పోలీసులపై హత్య కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 2021 సెప్టెంబర్ 5న దియోబంద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిత్కి గ్రామంలో పశువుల స్మగ్లర్లు, పోలీసుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. పోలీస్ కాల్పుల్లో గాయపడిన జిషన్ హైదర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో ఆ గ్రామస్తులు ఆగ్రహంతో రగిలిపోయారు. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తిని గోహత్య కేసులో తప్పుగా ఇరికించి ఎన్కౌంటర్ చేసి చంపారంటూ ఆరోపించారు.
కాగా, మృతుడి భార్య అఫ్రోజ్ దీనిపై కోర్టును ఆశ్రయించింది. దర్యాప్తు పేరుతో తన భర్తను పిలిచిన పోలీసులు ఎన్కౌంటర్లో హత్య చేసినట్లు ఆరోపించింది. ఫేక్ ఎన్కౌంటర్పై దర్యాప్తు జరిపి బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోర్టును కోరింది. అలాగే సీఎం పోర్టల్లో కూడా దీనిపై ఫిర్యాదు చేసింది.
మరోవైపు మృతుడి భార్య పిటిషన్పై ఏడాదిన్నరపాటు విచారణ జరిపిన కోర్టు తీర్పు ఇచ్చింది. జిషన్ హైదర్ ఎన్కౌంటర్లో పాల్గొన్న సబ్ ఇన్స్పెక్టర్లు ఓంవీర్, యశ్పాల్ సింగ్, అస్గర్ అలీ, హెడ్ కానిస్టేబుళ్లు సుఖ్పాల్ సింగ్, కున్వర్ భరత్, ప్రమోద్ కుమార్, విపిన్, కానిస్టేబుళ్లు రాజ్వీర్ సింగ్, దేవేంద్ర, నీతూ యాదవ్, అంకిత్ కుమార్, బ్రజేష్ కుమార్లపై హత్య కేసు నమోదు చేయాలని ఆదేశించింది.
ఈ నేపథ్యంలో ముగ్గురు సబ్ ఇన్స్పెక్టర్లతోసహా 12 మంది పోలీసులపై హత్యా సెక్షన్ల కింద ఆదివారం కేసు నమోదు చేసినట్లు ఎస్పీ సూరజ్ రాయ్ తెలిపారు. దీనిపై దర్యాప్తు జరిపి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.