న్యూఢిల్లీ: కొత్త ఏడాది రోజున విషాదం జరిగింది. స్కూటీపై వెళ్తున్న యువతిని ఒక కారు ఢీకొట్టింది. కారు కింద భాగంలో చిక్కుకున్న ఆమెను కొన్ని కిలోమీటర్ల దూరం వరకు అది ఈడ్చుకెళ్లింది. దీంతో ఆ యువతి మరణించింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. అమన్ విహార్ ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల మహిళ న్యూ ఇయర్ వేడుకల తర్వాత స్కూటీపై ఇంటికి తిరిగి వెళ్తున్నది. సుల్తాన్పురి ప్రాంతంలో ఐదుగురు ప్రయాణించిన కారు ఆ స్కూటీని ఢీకొట్టింది. అయినప్పటికీ కారును వారు నిలుపలేదు. ఆ మహిళ కాళ్లు కారు ముందు భాగంలో ఇరుక్కున్నాయి. ఈ నేపథ్యంలో ఆ కారు పలు కిలోమీటర్ల వరకు ఆమెను రోడ్డుపై ఈడ్చుకెళ్లింది.
కాగా, ఆదివారం ఉదయం 3.24 నిమిషాలకు దీనిని గమనించిన కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అలాగే కంఝవాలా ప్రాంతంలో రోడ్డు పక్కన యువతి మృతదేహం పడి ఉన్నట్లు 4.11 గంటలకు పోలీసులకు మరో ఫోన్ కాల్ వచ్చింది. దీంతో వారు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. కారు ఈడ్చుకెళ్లడంతో ఆ మహిళ దుస్తులు చిరిగి మృతదేహం నగ్నంగా పడి ఉండటాన్ని గమనించారు.
సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించిన పోలీసులు నంబర్ ప్లేట్ ఆధారంగా ఆ కారు యజమానిని గుర్తించారు. అతడితోపాటు కారు డ్రైవర్, అందులో ప్రయాణించిన రేషన్ షాప్ ఓనర్, క్రెడిట్ కార్డ్ ఏజెంట్ను అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఆ మహిళపై లైంగిక దాడి జరిపి హత్య చేసి మృతదేహాన్ని రోడ్డు పక్కగా పడేసినట్లు తొలుత సోషల్ మీడియాలో పలు పోస్టులు వచ్చాయి. అయితే పోలీసులు వీటిని ఖండించారు.
మరోవైపు , ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ ఈ సంఘటనపై ట్వీట్ చేశారు. కారులో ఉన్న వ్యక్తులు మద్యం తాగి ఉన్నట్లుగా తెలిసిందన్నారు. ఈ నేపథ్యంలో ఈ సంఘటనపై ఢిల్లీ పోలీసుల నుంచి మరిన్ని వివరాలు కోరుతానని, నిజం ఏమిటో బయటకు రావాలని అందులో పేర్కొన్నారు.
दिल्ली के कंझावला में एक लड़की की नग्न अवस्था में लाश मिली, बताया जा रहा है कि कुछ लड़कों ने नशे की हालत में गाड़ी से उसकी स्कूटी को टक्कर मारी और उसे कई किलोमीटर तक घसीटा।
ये मामला बेहद भयानक है, मैं दिल्ली पुलिस को हाज़िरी समन जारी कर रही हूँ। पूरा सच सामने आना चाहिए।— Swati Maliwal (@SwatiJaiHind) January 1, 2023