పాట్నా: దేశ రాజధాని ఢిల్లీలో జనవరి 1న జరిగిన తరహాలో మరో సంఘటన జరిగింది. వృద్ధుడ్ని ఢీకొట్టిన కారు 8 కిలోమీటర్ల దూరం వరకు బానెట్పై ఈడ్చుకెళ్లింది. అనంతరం డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ఆ వృద్ధుడు కారు ముందు పడ్డాడు. అయినా కారు నిలుపని డ్రైవర్, వృద్ధుడి మీదగా నడపడంతో ఆయన అక్కడికక్కడే చనిపోయాడు. బీహార్లోని తూర్పు చంపారన్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కొత్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని బాంగ్రా గ్రామానికి చెందిన 70 ఏళ్ల శంకర్, సైకిల్ తొక్కుతూ క్రాస్ రోడ్డ్ వద్ద జాతీయ రహదారి 27ను దాటుతున్నాడు. ఇంతలో వేగంగా వచ్చిన కారు ఆ వృద్ధుడ్ని ఢీకొట్టింది. కారు బానెట్పై పడిన ఆయన వైపర్ను గట్టిగా పట్టుకుని వేలాడాడు. కారు ఆపాలని కేకలు వేశాడు.
కాగా, ఆ రోడ్డుపై వెళ్లే వాహనదారులు కూడా దీనిని చూశారు. కారు నిలుపాలంటూ గట్టిగా అరిచారు. అయినా డ్రైవర్ కారును ఆపలేదు. కొందరు ఫాలో కావడంతో కారును వేగంగా నడిపాడు. కొత్వాలోని కదమ్ చౌక్ వద్ద సడన్ బ్రేక్ వేశాడు. దీంతో బానెట్పై ఉన్న వృద్ధుడు కారు ముందుపడ్డాడు. అయినప్పటికీ కారు ఆపకుండా నిర్లక్ష్యంగా వృద్ధుడి పైనుంచి కారును నడిపాడు. దీంతో ఆయన అక్కడికక్కడే చనిపోయాడు.
మరోవైపు ఈ సమాచారం అందుకున్న పోలీసులు జాతీయ రహదారిలోని ప్రాంతాల పోలీస్ స్టేషన్లను అలెర్ట్ చేశారు. దీంతో ఒకచోట ఆగి ఉన్న కారును పిప్రకోఠి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన కారు డ్రైవర్, అందులో ప్రయాణించిన వారి కోసం వెతుకుతున్నారు. నంబర్ ప్లేట్ ఆధారంగా కారు యజమానిని గుర్తించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.