ఖలీల్వాడి, ఏప్రిల్ 9: నిజామాబాద్లోని ఉమామహేశ్వరి ఆలయంలో చతుర్వేద సదస్సు, అథర్వణ వేదయాగం అట్టహాసంగా కొనసాగుతున్నది. లోక కల్యాణార్థం తెలంగాణ వేదశాస్త్ర ప్రవర్తక సభ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వేడుకలు శుక్రవారం రెండో రోజు కొనసాగాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు చతుర్వేద పరీక్షలు, సాయంత్రం నుంచి రాత్రి వరకు నామ సంకీర్తన, మంగళంపల్లి వేణుగోపాల శర్మ, గుదిమొల్ల మురళీకృష్ణమాచార్యులు, బాచంపల్లి సంతోష్కుమార్ శర్మ ఆధ్వర్యంలో ప్రవచనాలు నిర్వహించారు. శనివారం ఉదయం అథర్వణ వేద యాగ పూర్ణాహుతి, అవభృతం, సాయంత్రం ఉమామహేశ్వర స్వామికి మాస శివరాత్రి ప్రయుక్త వేద పండితులతో మహా రుద్రాభిషేకం, వంశీకృష్ణ ఘనాపాటి(దత్త పీఠ విద్యాంసులు, వేద విజ్ఞాన విష్టరం చతుర్వేద విద్యాలయ సంస్థాపకులు, మైసూరు)తో వేద సభ ఆరంభం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. సాయంత్రం విద్యార్థులకు విజయ పత్రిక బహూకరణ, అనంతరం అతిథులకు సన్మానం, రాత్రి 8:30 గంటలకు కృతజ్ఞత సమర్పణ ఉంటుందన్నారు. వేడుకల్లో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ సహకరించాలని వారు కోరారు.