న్యూఢిల్లీ: పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ఇవాళ ఢిల్లీలో పర్యటించనున్నారు. అయితే ఆయన బీజేపీ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో ఆయన ఇవాళ భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మాజీ నేత అయిన అమరీందర్.. బీజేపీలో చేరుతారన్న డౌట్స్ వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ బీజేపీలో చేరితే, అప్పుడు కెప్టెన్ అమరీందర్ సింగ్కు మోదీ సర్కార్ భారీ ఆఫర్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా కెప్టెన్ అమరీందర్కు అవకాశం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ బీజేపీలో అమరీందర్ చేరకున్నా.. ఆయన చేత కొత్త పార్టీని ఏర్పాటు చేసి, ఆ తర్వాత బీజేపీకి అనుబంధంగా ఆ పార్టీ పనిచేసేలా కసరత్తులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అమరీందర్ ఒక్కరే కాదు, కాంగ్రెస్ గేమ్ప్లాన్ను ఓడించాలంటే, పంజాబ్లోని జాతీయవాదులందరూ చేతులు కలపాలని హర్యానా మంత్రి విజ్ ఇటీవల తెలిపారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో వచ్చిన ముసలం వల్ల కెప్టెన్ అమరీందర్ పంజాబ్ సీఎం బాధ్యతలకు గుడ్బై చెప్పారు. నవజ్యోత్ సింగ్ సిద్ధూకు పీసీసీ పగ్గాలు ఇవ్వడంతో పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో సీన్ రివర్స్ అయ్యింది.