న్యూఢిల్లీ: తన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకునేందుకు దేశవ్యాప్తంగా డీఎన్ఏ పరీక్ష (DNA Test) నిర్వహించాలని కోరుతూ ఒక వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. పరిశీలించిన సర్వోన్నత న్యాయస్థానం మొత్తం వ్యవస్థలను కోర్టులు నడపలేవని చెప్పింది. ఆ పిటిషన్ను తిరస్కరించింది. తన పేరెంట్స్ ఎవరన్నది తెలుసుకునేందుకు ఒక వ్యక్తి చాలా కాలంపాటు న్యాయపోరాటం చేస్తున్నాడు. చివరకు అతడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. పేరెంట్హుడ్ వివాదాన్ని పరిష్కరించేందుకు దేశవ్యాప్తంగా డీఎన్ఏ టెస్ట్ నిర్వహించాలని తన పిటిషన్లో కోరాడు.
కాగా, న్యాయమూర్తులు సంజయ్ కిషన్ కౌల్, సుధాన్షు ధులియాలతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ పిటిషన్పై విచారణ జరిపింది. ‘మీరు దేశవ్యాప్తంగా డీఎన్ఏ పరీక్ష చేయాలనుకుంటున్నారా? ఇది ఎలాంటి పిటిషన్?’ అని కోర్టుకు స్వయంగా హాజరై తన వాదన వినిపించిన ఆ వ్యక్తిని ప్రశ్నించింది. దేశంలోని అన్ని వ్యవస్థలను కోర్టులు నడపలేవని తెలిపింది. ఒక కేసులో ఏ సమస్య తలెత్తుతుందో దానిని మాత్రమే కోర్టులు నిర్ణయిస్తాయని పేర్కొంది.
మరోవైపు భారతీయ సాక్ష్యాల చట్టంలోని సెక్షన్ 112 ప్రకారం చెల్లుబాటు అయ్యే వివాహం కొనసాగింపు సమయంలో పుట్టిన బిడ్డ చట్టబద్ధతను మాత్రమే రుజువుగా పరిగణిస్తారని సుప్రీంకోర్టు తెలిపింది. అలాగే దేశవ్యాప్తంగా డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలన్న పిటిషనర్ అభ్యర్థన చాలా కష్టసాధ్యమని పేర్కొంటూ ఆ పిటిషన్ను తిరస్కరించింది.