న్యూఢిల్లీ, మే 29: ఉగ్రవాదులకు నిధులు సమకూర్చారనే ఆరోపణలపై ఎన్ఐఏ అరెస్టు చేసిన జమ్ముకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ అధ్యక్షుడు యాసిన్ మాలిక్ను అల్ఖైదా నేత ఒసామా బిన్ లాడెన్తో పోల్చలేమని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. జీవిత ఖైదు విధించిన వ్యక్తికి సైతం తన వాదనను వినిపించే హక్కు రాజ్యాంగం కల్పించిందని వ్యాఖ్యానించింది. యాసిన్ మాలిక్కు ఉరి శిక్ష వేయాలని కోరుతూ ఎన్ఐఏ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు ఈ మేరకు వ్యాఖ్యానించింది. ఆగస్టు 9న తదుపరి విచారణ ఉంటుందని తెలిపింది.
ఎన్ఐఏ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఎంతో చాకచక్యంగా తాను అపరాధ భావనతో ఉన్నట్టు మాలిక్ విచారణను తప్పించుకుంటున్నాడని మెహతా చెప్పారు. ఒకసారి విచారణను ఎదుర్కొంటే ఉరిశిక్ష తప్పదని అతనికి తెలుసని, అందుకే మాలిక్ తెలివిగా వ్యవహరిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదులను ఇలాగే వదిలేస్తే… భవిష్యత్తులో ఉగ్రదాడులు చేసిన ప్రతిఒక్కరూ ఇలాగే అపరాధ భావనతో బాధపడుతున్నానని చెప్పి శిక్ష నుంచి తప్పించుకుంటారని మెహతా వ్యాఖ్యానించారు. దీంతో స్పందించిన జస్టిస్ మృదుల్ రాజ్యాంగం అతనికి కల్పించిన హక్కు అని వ్యాఖ్యానించారు.
చాతుర్యం అనేది న్యాయవాదుల హక్కు మాత్రమే కాదని, న్యాయమూర్తులకు రాజ్యాంగం కల్పించిన హక్కు అని తెలిపారు. మాలిక్ను మెహతాతో పాటు ఎన్ఐఏ కూడా ఒసామా బిన్ లాడెన్తో పోల్చారు. దీంతో స్పందించిన న్యాయస్థానం మాలిక్పై నమోదైన కేసులో అతన్ని లాడెన్తో పోల్చలేమని వ్యాఖ్యానించింది. యాసిన్ మరణశిక్షపై లా కమిషన్ సిఫారసులను హైకోర్టు కోరింది. ఉగ్ర కార్యకలాపాలతో పాటు వేర్పాటువాద రాజకీయాలకు పాల్పడిన మాలిక్ కేసును అరుదైన కేసుగా పరిగణించి ఉరిశిక్షను అమలు చేయాలని మెహతా కోరారు.