న్యూఢిల్లీ, జనవరి 3: బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు, ప్రజా ప్రతినిధులు స్వయం సంయమనం పాటించాలని, ఇతరులను కించపరిచే లేదా అవమానపరిచే వ్యాఖ్యలు చేయరాదని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ప్రజాప్రతినిధుల వాక్ స్వాతంత్య్రంపై అదనపు ఆంక్షలు విధించలేమని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. సమష్టి బాధ్యత సూత్రం వర్తింపజేసినప్పటికీ ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలను మొత్తం ప్రభుత్వానికి ఆపాదించలేమని జస్టిస్ ఎస్ఏ నజీర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం పేర్కొంది.
ఉత్తరప్రదేశ్లో 2016లో నమోదైన ఓ కేసుకు సంబంధించిన కేసులో కోర్టు మంగళవారం ఈ తీర్పును వెలువరించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(2)లో సూచించినవి మినహా ప్రజాప్రతినిధుల భావప్రకటనా స్వేచ్ఛపై అదనంగా ఎటువంటి పరిమితులు విధించలేమని తెలిపింది. ఓ మంత్రి చేసిన ప్రకటన రాష్ట్ర వ్యవహారాలకు సంబంధించినదైనప్పటికీ.. ఆ వ్యాఖ్యలను మొత్తం ప్రభుత్వానివిగా పరిగణించలేమని పేర్కొంది.
స్వేచ్ఛను హరిస్తాయి
ఆర్టికల్ 19లోని ఆంక్షలకు తోడు భావ ప్రకటనా స్వేచ్ఛపై మరిన్ని కఠిన ఆంక్షలు విధించలేమని ధర్మాసనంలో సభ్యురాలైన జస్టిస్ బీవీ నాగరత్న పేర్కొన్నారు. ఒకవేళ మంత్రి అధికార హోదాలో ఇతరులను కించపరిచే వ్యాఖ్యలు చేస్తే.. వాటిని ప్రభుత్వానికి ఆపాదించవచ్చని స్పష్టంచేశారు. విద్వేషపూరిత ప్రసంగాలు సమాజంలో అసమానతలను సృష్టించడం ద్వారా మౌలిక విలువలకు విఘాతం కలిగిస్తాయని పేర్కొన్నారు. విభిన్న నేపథ్యాల పౌరులు ఉన్న భారత్ వంటి దేశంలో ద్వేషపూరితమైన వ్యాఖ్యలు స్వేచ్ఛను, సమానత్వాన్ని దెబ్బతీస్తాయని అభిప్రాయపడ్డారు. భావ ప్రకటనా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్య్రం పౌరులకు ఎంతో అవసరమైన హక్కు అని, దీనిపై పౌరులకు అవగాహన కల్పించాలని అన్నారు.
ఎవరీ జస్టిస్ నాగరత్న?
వరుసగా రెండు రోజుల్లో నోట్ల రద్దు, భావప్రకటన స్వేచ్ఛపైన సుప్రీం కోర్టు వెలువరించిన కీలక తీర్పుల్లో జస్టిస్ బీవీ నాగరత్న భిన్నాభిప్రాయ తీర్పులు ఇచ్చి వార్తల్లో నిలిచారు. ధర్మాసనంలోని మెజారిటీ న్యాయమూర్తుల అభిప్రాయాలకు భిన్నంగా ఆమె ఈ కేసుల్లో తన అభిప్రాయాలు విస్పష్టంగా వెల్లడించారు. జస్టిస్ బీవీ నాగరత్న కర్ణాటకలో జన్మించారు. ఆమె తండ్రి జస్టిస్ ఈఎస్ వెంకట్రామయ్య 19వ సీజేఐగా పని చేశారు. ఢిల్లీ యూనివర్సిటీలో న్యాయ పట్టా పొందిన నాగరత్న 1987 అక్టోబరు 28న బెంగళూరులో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. 2008లో కర్ణాటక హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులైన ఆమె.. 2010లో శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. 2021 ఆగస్టు 26న సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు. 2027 అక్టోబరు 29 వరకు ఆమె పదవీకాలం ఉంది. దేశానికి ఆమె తొలి మహిళా సీజేఐగా నియమితులయ్యే అవకాశం ఉన్నది.