Candidate Walks on Embers | ఎన్నికలు అనగానే రాజకీయ నాయకుల నోటి వెంట వాగ్దానాలు వరదలా ప్రవహిస్తాయి. తమను గెలిపిస్తే అది చేస్తాం.. ఇది చేస్తాం అని హామీలు ఇచ్చేస్తారు. ఓట్ల కోసం జనాల గడ్డాలు పట్టుకుని మరీ బ్రతిమిలాడతారు. తీరా గెలిచాక.. సీన్ రివర్స్ అవుతుంది. అందుకే తన మాటలపై ప్రజలకు నమ్మకం కలిగించడం కోసం ఒక వ్యక్తి అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ఈ సంఘటన బిహార్లో వెలుగు చూసింది.
సర్పంచ్ పదవి కోసం పోటీ పడుతున్న ఆ వ్యక్తి… జనాల నమ్మకాన్ని సంపాదించడం కోసం ఏకంగా అగ్ని పరీక్షకు సిద్ధమయ్యాడు. దేవత ముందు అగ్ని గుండంలో నడిచాడు. గోపాల్గంజ్ షీర్ గ్రామ పంచాయతీకి నవంబర్ 29న ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్ పదవి కోసం పలువురు పోటీ పడుతున్నారు. వీరిలో మున్నా మహోత్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. తనను సర్పంచ్గా గెలిపిస్తే.. ఊరి జనాలకు ఎంతో మేలు చేస్తాను అని అతను హామీ ఇచ్చాడు.
అంతటితో ఆగకుండా.. తను మాట మీద నిలబడే వ్యక్తిని అని జనాలకు తెలియడం కోసం ఏకంగా అగ్ని పరీక్షకు సిద్ధం అయ్యాడు. తనను తాను అమ్మ వారి భక్తుడిగా చెప్పుకున్న మున్నా.. స్థానికంగా ఉన్న ఆలయం ముందు అగ్ని గుండం ఏర్పాటు చేయించాడు. ఆ నిప్పుల మీదుగా నడిచి.. తనను సర్పంచ్గా గెలిపిస్తే.. ప్రచారంలో ఇచ్చిన హామీలన్నింటిని నేరవేరుస్తానని అమ్మవారి ఎదురుగా ప్రమాణం చేశాడు.
అంతేకాక ఎన్నికలు అయిపోయేంత వరకు తాను ఎంతో నిష్టగా అమ్మవారిని కొలుస్తానని చెప్పాడు. అమ్మవారి దయతో తాను సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధిస్తానన్నాడు. ఇక ఈ అగ్నిపరీక్ష తంతు చూడటానికి గ్రామస్తులంతా తరలి వచ్చారు. మరి జనాలు మున్నాను నమ్ముతారో లేదో చూడాలి.