న్యూఢిల్లీ, డిసెంబర్ 17: నిద్రలేమితో బాధపడేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్నది. ఈ రుగ్మత అంత ప్రమాదకారి కాదని భావిస్తూ వస్తున్నారు. కానీ సుదీర్ఘకాలంగా నిద్రలేమితో సతమతమైతే క్యాన్సర్ బారిన పడటం ఖాయమని, బుద్ధిమాంద్యం, పార్కిన్సన్స్ వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని తాజా అధ్యయనం హెచ్చరించింది. గతకొన్నేండ్లుగా రొమ్ము, తల, మెడ, కిడ్నీ, గాల్బ్లాడర్కు సంబంధించి క్యాన్సర్ కేసులు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి. దీనికి నిద్రలేమికి సంబంధముందని సైంటిస్టులు భావిస్తున్నారు. చీకటిపడగానే మెదడు నుంచి మెలటోనిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. రాత్రంతా మేల్కోని పనిచేయటం వల్ల హార్మోన్ విడుదల కాదు. దీంతో శరీరం క్యాన్సర్ ముప్పున పడే అవకాశం ఎక్కువని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సుదీర్ఘకాలం నిద్రలేమి వల్ల.. శరీరంలో జీవ గడియారం గతి తప్పుతుందని, దాంతో కొన్ని అవయవాల్లో క్యాన్సర్ తలెత్తుతున్నదని నిపుణులు అంచనావేశారు.