న్యూఢిల్లీ: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో(Canada PM Justin Trudeau) పరిస్థితి దయనీయంగా మారింది. జీ20 సమావేశాలకు వచ్చిన ఆయన .. ప్రస్తుతం భారత్లోనే చిక్కుకునిపోయారు. ట్రూడో వచ్చిన విమానం దెబ్బతినడంతో.. ఆయన తిరుగు ప్రయాణం చేపట్టలేదు. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం వల్లే .. ట్రూడో ఇండియాలో ఉండిపోయినట్లు తెలుస్తోంది. అయితే కెనడా నుంచి బ్యాకప్ ప్లేన్ కోసం ఆయన ఎదురుచూస్తున్నారు. ఆ దేశం నుంచి మరో విమానం ఇండియాకు రానున్నది. లేదంటే ఆయన వచ్చిన విమానాన్ని రిపేర్ చేసి పంపాల్సి ఉంటుంది. మంగళవారం మధ్యాహ్నం ట్రూడో విమానం.. కెనడాకు పయనం అయ్యే ఛాన్సు ఉన్నట్లు ఆ దేశ సెక్యూర్టీ దళాలు పేర్కొంటున్నాయి. జీ20 సమావేశాలు ముగిసిన తర్వాత ఆదివారం సాయంత్రమే.. ట్రూడో తమ దేశానికి వెళ్లాల్సి ఉంది. కానీ విమానంలో టెక్నికల్ లోపం వల్ల ఆయనతో పాటు ఆ దేశ ప్రతినిధుల బృందం కూడా ఇండియాలోనే నిలిచిపోయారు.