రాయ్పూర్: బెట్టింగ్ యాప్ ప్రమోటర్ల నుంచి రూ.508 కోట్ల అందాయన్న ఈడీ (ED) ఆరోపణలపై ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘేల్ (Bhupesh Baghel) స్పందించారు. ఇంత కంటే పెద్ద జోక్ ఏముంటుందని ఎద్దేవా చేశారు. నేను ఈ రోజు ఒక వ్యక్తి తీసుకొచ్చి ప్రధాని మోదీపై (PM Modi) ఆరోపణలు చేయిస్తే.. దానిపై వారు దర్యాప్తు చేస్తారా అంటూ ఈడీని ఉద్దేశించి అన్నారు. ఒకరి ప్రతిష్టను (Reputation)దెబ్బతీయడం చాలా సులవని విమర్శించారు. తాను గతంలో చెప్పినట్లే ఈడీ, ఐటీ, డీఆర్ఐ, సీబీఐ వంటి సంస్థల సహాయంతో ఛత్తీస్గ్ ఎన్నికల్లో బీజేపీ పోటీచేయాలని అనుకుంటుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల వేళ ఈడీ తన ప్రతిష్టను దెబ్బ తీసేందుకు అత్యంత దారుణమైన ప్రయత్నాలు చేస్తున్నదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయడానికి జరుగుతున్న రాజకీయ ప్రయత్నమని చెప్పారు.
ఈడీ ఆరోపణలను ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఖండించింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈడీని ఆయుధంలా (Weapon) వాడుకుంటున్నదని పేర్కొంది. అసలు ఆ రూ.500 కోట్లు ఎక్కడున్నాయని ఉపముఖ్యమంత్రి డీఎస్ సింగ్ డియో (TS Singh Deo) అని ప్రశ్నించారు. ఆ నగదును ఈడీ చూపించాలని డిమాండ్ చేశారు.
ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘేల్కు రూ.508 కోట్ల రూపాయలు బెట్టింగ్ యాప్ (మహదేవ్ యాప్) ప్రమోటర్ల నుంచి అందాయన్న వార్తలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ చేపట్టింది. ఈ వ్యవహారానికి సంబంధించి భూపేష్ బఘేల్పై ఈడీ శుక్రవారం సంచలన ఆరోపణలు చేసింది. భారీ మొత్తంలో నగదును తరలించేందుకు మహదేవ్ యాప్ ప్రమోటర్లు యుఏఈ నుంచి అసీం దాస్ అనే కొరియర్ను రాయపూర్కు పంపగా, అతడిని ఈడీ గురువారం పట్టుకుంది. ఫోరెన్సిక్ పరీక్షలు జరపగా.. మహదేవ్ యాప్ ప్రమోటర్లు ఛత్తీస్గఢ్లోని ‘బఘేల్’ అనే రాజకీయ నాయకుడికి రూ.508 కోట్లు ముట్టజెప్పారని అసీం దాస్ ఈడీకి వాంగ్మూలం ఇచ్చాడు. దీనిపై తదుపరి విచారణ చేపడతున్నామని ఈడీ అధికారులు వెల్లడించారు.
గురువారం రాయపూర్, భిలాయ్ నగరాల్లో చేపట్టిన దాడుల్లో మొత్తం రూ.14.92 కోట్లను ఈడీ సీజ్ చేసింది. రాయపూర్లోని ఓ హోటల్ పార్కింగ్ ఏరియాలో ఉన్న ఎస్యూవీ కారులో రూ.3.12 కోట్ల నగదు పట్టుబడింది. భిలాయ్లో మరోచోట దాచిపెట్టిన రూ.1.8 కోట్లను కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది. కోట్ల రూపాయల్ని తరలించేందుకు యుఏఈ నుంచి వచ్చిన కొరియర్ అసీం దాస్ను, అతడితోపాటు ఓ కానిస్టేబుల్ను ఈడీ అదుపులోకి తీసుకుంది. మహదేవ్ యాప్ ప్రమోటర్లకు చెందిన బినామీ బ్యాంక్ ఖాతాల్లోని రూ.10 కోట్లను ఈడీ సీజ్ చేసింది. ‘ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ ఖర్చుల కోసం యాప్ ప్రమోటర్లు తనను పంపారని విచారణలో అసీం దాస్ తెలిపాడు’ అంటూ ఈడీ పేర్కొన్నది.