ముంబై : ధారావి.. ముంబైలో అతిపెద్ద స్లమ్. ఇక్కడ సుమారు ఆరు లక్షల మంది జనాభా ఉంటారు. కానీ గత ఏడాది కోవిడ్19ను ఆ స్లమ్ అత్యంత సమర్థవంతంగా నియంత్రించింది. నిజానికి సోషల్ డిస్టాన్సింగ్ ఇక్కడ పాటించడం కష్టమే. అయినా తొలి దశలో కరోనాను అణిచిన విధానం అందర్నీ ఆకట్టుకున్నది. కేంద్ర ఆరోగ్యశాఖ, ప్రపంచ ఆరోగ్య సంస్థలు ధారావిపై ప్రశంసలు కూడా కురిపించాయి. ఇప్పుడు సెకండ్ వేవ్లో కూడా ఎక్కువ కేసులు నమోదు కావడం లేదు. దీంతో ధారావి మోడల్ బాగా వర్కౌట్ అయ్యిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. బృహణ్ ముంబై కార్పొరేషన్ గత ఏడాది సమర్థవంతంగా చేపట్టిన ప్రణాళికల వల్లే అక్కడ వైరస్ అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది.
ముంబైలో ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసులు అయిదు లక్షలు దాటాయి. దాంట్లో ధారావిలో 5676 కేసులు నమోదు అయ్యాయి. నిజానికి ధారావి జన సాంద్రతతో పోలిస్తే ఆ సంఖ్య తక్కువే. ఆదివారం రోజున అక్కడ కేవలం 76 పాజిటివ్ కేసులే నమోదు అయ్యాయి. ధారావిలో కేసులు తక్కువ సంఖ్యలో నమోదు కావడానికి ప్రభుత్వ, ఎన్జీవోల పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ వేవ్ సమయంలో సహజసిద్దమైన యాంటీబాడీలను ధారావి వాసులు పొందారు. వారిలో ఉన్న రోగనిరోధక శక్తి వారిని రక్షించింది. ఇక ఇప్పుడు వ్యాక్సినేషన్ డ్రైవ్ అక్కడ మెరుగైన రీతిలో సాగుతోంది. సెకండ్ వేవ్లో కూడా ధారావి విజేతగా ఆవిర్భవిస్తుందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి.
ఆర్మ్మ్యాన్ ఎన్జీవో చీఫ్ ఆఫీసర్ కార్లీలే పెరీరా మాట్లాడుతూ.. బిల్డింగ్ నివాసితులపై కోవిడ్19 చూపిస్తున్న ప్రభావం.. స్లమ్ ప్రజలపై చూపడం లేదన్నారు. ఫస్ట్వేవ్ సమయంలో ధారావిలో కరోనా విజృంభిస్తుందని భయపడ్డాం, కానీ అలా జరగలేదు. అంటే ఇక్కడ కరోనా రాలేదని కాదు, ఇక్కడ ఉన్న జన సాంద్రతను గమనిస్తే, చాలా తక్కువ స్థాయిలో కేసులు వచ్చినట్లు తెలిపారు. గత ఏడాది ముంబైలో నిర్వహించిన సీరో స్టడీ ఆధారంగా.. మురికివాడల్లో సుమారు 57 శాతం జనాభాలో యాంటీబాడీలు ఉన్నట్లు తేలిన విషయం తెలిసిందే. ముంబై బిల్డింగ్ ప్రాంతాల్లో నివసించే వారిలో కేవలం 16 శాతం మందికి మాత్రమే యాంటీబాడీలు ఉన్నట్లు తేలింది. ఫస్ట్ వేవ్లో స్లమ్లో ఉన్నవారికి ఎక్కువ పాజిటివ్ కేసులు వచ్చాయని, ఈసారి బిల్డింగ్ ప్రదేశాల్లో నివసిస్తున్న వారికి ఎక్కువగా కరోనా వస్తున్నట్లు డాక్టర్ ఫర్ యూ వ్యవస్థాపకుడు డాక్టర్ రవికాంత్ సింగ్ తెలిపారు.
ధారావిలో ఇప్పటికీ విస్తృత స్థాయిలో కరోనా పరీక్షలు చేస్తున్నారు. మొబైల్ క్లినిక్లతో ఎప్పటికప్పుడు పాజిటివ్ కేసులను గుర్తిస్తున్నారు. ప్రభుత్వం, ఎన్జీవోలు చేపడుతున్న కార్యక్రమాల వల్లే ధారావిలో తక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రస్తుతం ఆ మురికివాడలో జోరుగా చేపడుతున్నారు. ప్రభుత్వ ప్రతినిధులు ఇంటింటికీ వెళ్లి టీకా తీసుకోవాలంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. మొదట్లో వ్యాక్సిన్కు స్పందన తక్కువే ఉన్నా.. ప్రస్తుతం ధారావిలో వ్యాక్సినేషన్ డ్రైవ్ జోరందుకున్నట్లు చెబుతున్నారు.బీఎంసీ అధికారులు వ్యాక్సిన్ హబ్ను కూడా ఏర్పాటు చేశారు.