Gujarat polls | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ ప్రచార పర్వం ఇవాల్టితో ముగిసింది. తొలి దశ ఎన్నికలు డిసెంబర్ 1వ తేదీన జరుగనున్నాయి. తొలి ధశలో 89 స్థానాలకు పోలింగ్ జరుగనుండగా.. 788 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. తొలి దశలో మోర్బి, కచ్, రాజ్కోట్, పోర్బందర్, జునాగఢ్ వంటి స్థానాలు ఉండటంతో ఆసక్తి రేగుతున్నది. 19 జిల్లాల్లో జరుగనున్న ఓటింగ్లో దాదాపు 2 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
తొలి దశలో మొత్తం 89 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్లు పోటీ చేస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ 88 స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టింది. బహుజన సమాజ్వాదీ పార్టీ 57 మంది అభ్యర్థులకు టికెట్ ఇచ్చింది. అసదుద్దీన్ ఒవైసీ పార్టీ ఏఐఎంఐఎం ఆరుగురు అభ్యర్థులను మాత్రమే బరిలో నిలిపింది. చివరి రోజున బీజేపీ దాదాపు 160 ప్రాంతాల్లో పబ్లిక్ మీటింగ్స్ పెట్టింది. మూడు జిల్లాల్లో అమిత్షా, భావ్నగర్లో జేపీ నడ్డా, మాండ్వి, గాంధీధామ్లలో స్మృతి ఇరానీ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేపట్టారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు దశల్లో జరగనున్నాయి. డిసెంబర్ 1న తొలి దశ, డిసెంబర్ 5న మలి దశ పోలింగ్ జరగనున్నది. ఫలితాలు డిసెంబర్ 8న వెల్లడికానున్నాయి. గుజరాత్ శాసనసభ పదవీకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి 18 తో ముగుస్తుంది.