న్యూఢిల్లీ: పాకిస్తానీ అని ఎవర్నైనా పిలిస్తే, అది మత విశ్వాసాలను కించపరిచినట్లు కాదు అని సుప్రీంకోర్టు(Supreme Court) తెలిపింది. మియాన్-తియాన్ లేదా పాకిస్తానీ అని పిలవడం హేళనకరమే అయినా, కానీ దాంట్లో మత విశ్వాసాలను దెబ్బతీసే ఉద్దేశం లేదన్నారు. జస్టిస్ బీవీ నాగరత్న, సతీశ్ చంద్ర శర్మతో కూడిన ధర్మాసనం ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఓ ప్రభుత్వ ఉద్యోగిని పాకిస్తానీ అని పిలవడంతో అతను కేసును దాఖలు చేశారు. ఆ కేసులో ఇవాళ విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ అభిప్రాయాన్ని వెలుబుచ్చింది.
జార్ఖండ్కు చెందిన ఓ ఉర్దూ ట్రాన్స్లేటర్ ఈ ఫిర్యాదును నమోదు చేశారు. సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్న నిందితుడికి.. సమాచారం ఇచ్చేందుకు ఇంటికి వెళ్లిన సమయంలో.. ప్రభుత్వ ఉద్యోగిపై ఆవేశానికి లోనయ్యాడు. ఆ ఉద్యోగి మతాన్ని దూషిస్తే కొన్ని వ్యాఖ్యలు చేశాడు. విధులను అడ్డుకున్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆ వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఐపీసీలోని 298(మతపరమైన విశ్వాసాలు), 504(అవమానకర ప్రవర్తన), 353(ఉద్యోగిపై దాడి) సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు. ఈ కేసులో జార్ఖండ్ హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. పాకిస్తానీ అని పిలవడం అమర్యాదకరంగా ఉన్నా, అది మత విశ్వాసాలను దెబ్బతీసినట్లు కాదు అని సుప్రీం బెంచ్ తెలిపింది. శాంతికి విఘాతం కలిగించే రీతిలో నిందితుడు ప్రవర్తించలేదని కోర్టు చెప్పింది. ఐపీసీలోని 353 సెక్షన్ కింద నిందితుడికి శిక్ష విధించే అవకాశం లేదని కోర్టు పేర్కొన్నది.