Justice Abhijit Gangopadhyay | న్యూఢిల్లీ, మార్చి 3: పశ్చిమ బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు కీలక తీర్పులు వెలువరించి ‘ప్రజల న్యాయమూర్తి’గా పేరు పొందిన కలకత్తా హైకోర్టు జడ్జి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్ త్వరలో తన పదవి నుంచి వైదొలగనున్నారు. న్యాయమూర్తి పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్టు ఆయన వెల్లడించారు. ‘న్యాయమూర్తి పదవికి మంగళవారం రాజీనామా చేయబోతున్నా. ఈ నిర్ణయానికి రాష్ట్రంలోని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీయే కారణం. ఆ పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా.
నా రాజీనామాకు సంబంధించిన మరిన్ని వివరాలను తర్వాత వెల్లడిస్తా. న్యాయమూర్తిగా ఆరేండ్లు పనిచేశా. ఆ ప్రస్థానం ముగిసింది. ఇక నేను కొత్తగా చేయాల్సిందేమీ లేదు. నా తీర్పులు నచ్చనప్పుడు తృణమూల్ కాంగ్రెస్ నేతలు నన్ను పరిహసించారు. నన్ను తీవ్రంగా అవమానించారు. వారితో కొందరు న్యాయవాదులు కూడా గొంతు కలిపారు. నేను విశాల ప్రపంచంలోకి అడుగుపెట్టి ప్రజలతో మమేకం కావాల్సిన అవసరమున్నది. వ్యాజ్యాలను వేయాలనుకునేవారే న్యాయస్థానాలకు వస్తారు. కానీ, బయట చాలా మంది దురదృష్టవంతులు ఉన్నారు’ అని జస్టిస్ గంగోపాధ్యాయ్ ఓ ఇంటర్వ్యూలో వివరించారు. వాస్తవానికి ఆయన ఈ ఏడాది ఆగస్టులో రిటైర్ కావాల్సి ఉన్నట్టు తెలుస్తున్నది.