Delhi Metro | దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా రెండు కారిడార్లలో మెట్రో నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఇందుకు రూ.8400కోట్లు ఖర్చవనున్నది. కేబినెట్ నిర్ణయాలను కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వివరించారు. తొలి కారిడార్ లజ్పత్నగర్ నుంచి సాకేత్ జీ బ్లాక్ మధ్య.. 8.4 కిలోమీటర్లు ఉంటుందన్నారు. రెండో కారిడార్ ఇంద్రలోక్ నుంచి ఇంద్రప్రస్థ మధ్య 12.4 కిలోమీటర్లు ఉంటుందన్నారు.
రెండు కారిడార్లలో 2029 మార్చి నాటికి పనులు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. లజ్పత్ నగర్-సాకేత్ మధ్య నిర్మించనున్న మెట్రో బ్లాక్ సిల్వర్, మెజెంటా, పింక్, వైలెట్ లైన్లను కలుపుతుందని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ మార్గంలో ఎనిమిది స్టేషన్లు ఉంటాయన్నారు. ఇంద్రలోక్-ఇంద్రప్రస్థ మధ్య నిర్మించనున్న 12.377 కిలోమీటర్ల కారిడార్ గ్రీన్లైన్ పొడిగించనున్నట్లు అనురాగ్ ఠాకూర్ వివరించారు. ఇక్కడి ఎరుపు, పసుపు, ఎయిర్పోర్ట్ లైన్, మెజెంటా, వైలెట్, బ్లూ లైన్లోకి మారే అవకాశం ఉంటుందని వివరించారు.