న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: దేశంలో 13 ఏండ్ల నుంచి అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వంపై ప్రజలకు విముఖత పెరుగుతున్నది. ముఖ్యంగా ఇటీవల దేశంలో నీట్ వైఫల్యం, జెన్-జీ ఆందోళనలు కమలం పార్టీ ప్రతిష్టను దిగజారుస్తున్నాయి. సీ-ఓటర్ సంస్థ ఇటీవల నిర్వహించిన మూడ్ ఆఫ్ ద నేషన్ (ఎంఓటీఎన్) సర్వే కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. పెరిగిపోతున్న నిరుద్యోగం, అవినీతి, ద్రవ్యోల్బణం, ధరల పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఈ సర్వేలో ‘ప్రజాస్యామ్యం ప్రమాదంలో ఉంది’ అని 47 శాతం పేర్కొనగా, 42 శాతం మంది తాము అలా భావించడం లేదని పేర్కొన్నారు. జనవరిలో ఇదే సంస్థ నిర్వహించిన సర్వేలో మోదీకి మద్దతు రాగా, ప్రస్తుతం విరుద్ధ ఫలితాలను ఇచ్చింది. భారతదేశం నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, జెన్ జీ అసంతృప్తి లాంటి బహుళ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని, దీని ప్రభావం అధికార బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాదరణపై స్పష్టంగా కనిపిస్తున్నదని ఎంవీటీఎన్ తన తాజా సర్వేలో ప్రస్ఫుటంగా పేర్కొంది.
ఈ తాజా సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే బీజేపీకి సాధారణ మెజారిటీకి అవసరమైన దానికన్నా 11 తక్కువ సీట్లు వస్తాయి. 287 సీట్లతో బీజేబీ సౌకర్యవంతంగా అధికారాన్ని చేపడుతుందని జనవరి సర్వేలో పేర్కొనగా, ప్రస్తుతం బీజేపీకి దానికన్నా 26 సీట్లు తక్కువగా వచ్చాయి. ఇది ఆ పార్టీకి ఆందోళన కలిగించే విషయం. అయితే ఇప్పటికిప్పుడు బీజేపీకి వెంటనే వచ్చే నష్టం ఏదీ లేదు. ఈ సర్వేలో 26 సీట్లు తగ్గినా బెంగాల్, మహారాష్ట్రల్లో చోటుచేసుకున్న తాజా రాజకీయ పరిణామాలతో ఆ పార్టీ కూటమి 326 సీట్లతో ధీమాగానే ఉంది. ఒక విధంగా 2024 ఎన్నికల్లోని 293 సీట్ల కన్నా ఇది అధికమే. అయితే సంఖ్యాపరంగా చూస్తే మోదీ ప్రతిష్ట మాత్రం రోజురోజుకూ తగ్గుతూ వస్తున్నది. ఈ సర్వేలో ప్రధానిగా ఆయనకు అనుకూలంగా 49 శాతం మాత్రమే ఓటు వేయగా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి 27 శాతం ఆమోదముద్ర వేశారు.
బడా బాబులకే మోదీ పెద ్దపీట
మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక విధానాలు పెద్ద పారిశ్రామికవేత్తలు, బడాబాబులకు మాత్రమే ప్రయోజనం చేకూరుస్తున్నాయని 56 శాతం మంది అభిప్రాయపడ్డారు. అలాగే తమ భవిష్యత్ ఆదాయాలు మందకొడిగానే ఉంటాయని భావిస్తున్నట్టు చాలామంది పేర్కొనగా, భవిష్యత్ ఆశాజనకంగా ఉంటుందని 24 శాతం, లేదు మరింత దిగజారడమో, లేదా ప్రస్తుతమున్న దశలోనే ఉంటుందని 64 శాతం మంది పేర్కొన్నారు. అయోధ్యలో విరాళాల చోరీ కుంభకోణంపై పలువురు తీవ్రంగా స్పందించారు. ఇది కేంద్రంలోని మోదీ, యూపీలోని యోగి <ఆదిత్యానాథ్ ప్రభుత్వాల వైఫల్యమని, ఇది కచ్చితంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని 46.6 శాతం అభిప్రాయపడ్డారు. కాగా, ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో అవినీతి బాగా పెరిగిందని 43.2 శాతం మంది అభిప్రాయపడ్డారు. దేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య నిరుద్యోగమని, ధరల పెరుగుదల మోదీ ప్రభుత్వ అతిపెద్ద వైఫల్యంగా 23 శాతం మంది పేర్కొన్నారు.

సీ ఓటర్ సర్వేలో వెల్లడైన ముఖ్యమైన అంశాలు