న్యూఢిల్లీ: వైద్య చికిత్స కోసం కోల్కతా వచ్చి దారుణ హత్యకు గురైన బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనర్ హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెల్లడవుతున్నాయి. ఒక మహిళను ఎరవేసి హనీ ట్రాప్ ద్వారా ఎంపీని కోల్కతాకు రప్పించిన నిందితులు అతడిని ఓ అపార్ట్మెంట్లో హత్య చేసిన తర్వాత చర్మం వలిచి, ముక్కలు ముక్కలుగా నరికారు.
వాటిని ప్లాస్టిక్ బ్యాగ్ల్లో నగరమంతా పారవేశారని సీఐడీ అధికారులు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి బంగ్లాదేశ్ నుంచి వచ్చి ముంబైలో ఉంటున్న అక్రమ వలసదారుడు జిహాద్ హవల్దార్ను సీఐడీ అరెస్ట్ చేసింది. అతడు నేరంలో తన ప్రమేయాన్ని ఒప్పుకున్నాడని, శరీరాన్ని తానే ముక్కలు చేసినట్టు నిందితుడు తెలిపాడని సీఐడీ వర్గాలు వెల్లడించాయి. అయితే ఎంపీ హత్యకు ప్రధాన కారణం ఏమిటో ఇంకా వెల్లడి కాలేదు. ఆర్థికపరమైన వ్యవహారాలే ఈ హత్యకు దారితీసి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.