Leh bus | వచ్చే మే నెల నుంచి ఢిల్లీ-లేహ్ మధ్య బస్సు సర్వీసులు తిరిగి నడవనున్నాయి. ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఉన్న ఈ మార్గంలో ప్రయాణించేందుకు ఎందరో ఔత్సాహిక పర్యాటకులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) నుంచి ఆమోదం కోసం ఎదరుచూస్తున్నారు. ఈ మార్గంలో ఎన్నో పర్యాటక ప్రదేశాలను వీక్షించి ఆహ్లాదం పొందే అవకాశాలున్నాయి. ఇదే మార్గంలో అటల్ టన్నెల్, బరాలాచా పాస్, నాకీ పాస్, లాచుంగ్ పాస్ల మీదుగా బస్సు ప్రయాణం కొనసాగనున్నది.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మార్గం ఢిల్లీ-లేహ్ మధ్య బస్సులను నడిపేందుకు హిమాచల్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (హెచ్ఆర్టీసీ) సిద్ధమైంది. అన్నీ అనుకూలిస్తే వచ్చే మే నెల నుంచి తిరిగి బస్సు సర్వీసులు ప్రారంభమవుతాయి. గత సెప్టెంబర్ 15న ఢిల్లీ నుంచి లేహ్ మార్గంలో బస్సు సర్వీసులను నిలిపివేశారు. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ రోడ్ క్లియరెన్స్ పొందిన తర్వాత ఈ మార్గంలో బస్సు సర్వీసులు ప్రారంభమవుతాయి. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల ఈ మార్గంలో డ్రైవర్లు, కండక్టర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఈ మార్గంలో 2019 లో బస్సు సర్వీసులను నడపడం మొదలుపెట్టారు.
ఢిల్లీ-లేహ్ మార్గం హిమాచల్లో అతి పొడవైన మార్గం. ఇది 1,026 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మొత్తం 32 గంటల సమయం పడుతుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మార్గం కూడా. ఈ మార్గంలో ఉన్న అటల్ టన్నెల్ సిద్ధం కాకముందు ఈ బస్సు సర్వీసుకు 36 గంటలకు పైగా సమయం పట్టేది. అటల్ టన్నెల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత 46 కిలోమీటర్ల ప్రయాణం తగ్గిపోయింది. ఢిల్లీ-మనాలి-లేహ్ మార్గంలో వెళ్లే ఈ బస్సు.. అటల్ టన్నెల్ రోహ్తంగ్, బరాలాచా పాస్ (16020 అడుగులు), నాకీ పాస్ (15552 అడుగులు), లాచుంగ్ పాస్ (16620), తంగ్లాంగ్ పాస్ (17480) మీదుగా వెళ్తుంది. ఈ మార్గం గుండా ప్రయాణం చాలా థ్రిల్లింగ్ ఉంటుంది. వెయ్యి కిలోమీటర్లకు పైగా ప్రయాణించి ఎత్తైన కనుమ గుండా వెళ్లినందుకు కీలాంగ్ డిపో పేరు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదైంది.