ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 190 ఏళ్ల జైలు శిక్షను విధించింది ఓ కోర్టు. అసలు ఒక మనిషి 190 ఏళ్లు బతుకుతాడా? వందేళ్లు బతకడమే కష్టం. కానీ.. ఓ బస్ డ్రైవర్కు కోర్టు 190 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మధ్యప్రదేశ్లోని పన్నాకు చెందిన బస్ డ్రైవర్ షంషుద్దీన్(47) నిర్లక్ష్యంగా బస్సును నడిపి యాక్సిడెంట్ చేసి 22 మంది ప్రయాణికులు చనిపోవడానికి కారణం అయ్యాడు. ఈ ఘటన జరిగింది 2015లో.
65 మంది ప్యాసెంజర్లతో వెళ్తున్న బస్సు ఓ కెనాల్లో పడిపోయింది. ఆ సమయంలో కెనాల్లో నీళ్లు లేవు. బస్సు కింద పడగానే మంటలు వ్యాపించాయి. దీంతో 22 మంది ప్యాసెంజర్లు సజీవ దహనం అయ్యారు. మరికొందరు గాయపడ్డారు.
బస్సు ఎమర్జెన్సీ డోర్ను ఐరన్ రాడ్స్తో బ్లాక్ చేయడం, దాని ప్లేస్లో సీటును ఏర్పాటు చేయడం ద్వారా బస్సులో నుంచి ప్యాసెంజర్లు తప్పించుకునే మార్గం లేకపోయింది. అలాగే ప్యాసెంజర్లు వారిస్తున్నా కూడా బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా, వేగంగా బస్సును నడిపి బస్సు ప్రమాదానికి కారణం అయ్యాడని నేరం రుజువు అయింది.
దీంతో బస్సు డ్రైవర్, బస్సు ఓనర్ గ్యాందేంద్ర పాండే మీద పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు పూర్తయ్యాక లోకల్ కోర్టు జడ్జ్ ఆర్పీ సోంకర్ బస్ డ్రైవర్కు 19 సార్లు 10 సంవత్సరాల జైలు శిక్షను విధించారు. అంటే.. ఆ బస్ డ్రైవర్ జైలు శిక్ష పూర్తి కావడానికి 190 ఏళ్లు పడుతుంది. అతడు బతికినంత కాలం ఇక జైలు జీవితం అనుభవించేలా జడ్జ్ ఆ శిక్షను విధించారు. అలాగే.. బస్సు ఓనర్కు 10 సంవత్సరాల జైలు శిక్షను కోర్టు విధించింది.