ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే (Raj Thackeray) మహారాష్ట్ర ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో టోల్ ట్యాక్స్ వసూళ్లను నిలిపివేయాలని సోమవారం డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తమ పార్టీ కార్యకర్తలు టోల్ బూత్లను తగలబెడతారని హెచ్చరించారు. అలాగే చిన్న వాహనదారుల నుంచి టోల్ కలెక్షన్లు అడ్డుకుంటారని చెప్పారు.
కాగా, మీడియాతో మాట్లాడిన రాజ్ ఠాక్రే, టోల్ ట్యాక్స్ వసూళ్లు పెద్ద స్కామ్ అని ఆరోపించారు. ప్రతి ఏటా అవే కంపెనీలకు టోల్ వసూళ్ల కాంట్రాక్ట్లు ఎలా దక్కుతున్నాయని ప్రశ్నించారు. ఇప్పటికే రోడ్ ట్యాక్స్ చెల్లిస్తుండగా టోల్ ట్యాక్స్ ఎందుకు చెల్లించాలి అని నిలదీశారు. ఈ డబ్బంతా ఎక్కడకు వెళ్తున్నదని ప్రశ్నించారు. అయినప్పటికీ రహదారులు అద్వాన్నంగా ఉన్నాయని విమర్శించారు. చిన్న వాహనాలకు టోల్ ట్యాక్స్ ఎత్తివేస్తామంటూ అధికారంలో ఉన్న నాయకులు గతంలో ఇచ్చిన హామీల వీడియో క్లిప్లను ప్లే చేయాలంటూ తనదైన శైలిలో అనుచరులతో అన్నారు.
మరోవైపు సీఎం ఏక్నాథ్ షిండేతో దీని గురించి తాను మాట్లాడతానని రాజ్ ఠాక్రే తెలిపారు. ఆయన స్పందన చూసిన తర్వాత తమ పార్టీ కార్యకర్తలు రంగంలోకి దిగుతారని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని టోల్ బూత్ల వద్దకు వారు వెళ్తారని, చిన్న వాహనదారుల నుంచి టోల్ ట్యాక్స్ వసూలు చేయడాన్ని అడ్డుకుంటారని అన్నారు. ఒకవేళ ప్రభుత్వం తమ కార్యకర్తలపై చర్యలు తీసుకుంటే అప్పుడు టోల్ బూత్లను తగలబెడతామని ఆయన హెచ్చరించారు.