లక్నో: పొడవైన సొరంగం తవ్విన దొంగలు జ్యుయలరీ షాపులో చోరీకి ప్రయత్నించారు. లాకర్ను తెరిచేందుకు విఫలయత్నం చేశారు. చోరీ ప్రయత్నం ఫలించకపోవడంతో తమను క్షమించాలంటూ ఒక నోట్ రాశారు. ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఈ సంఘటన జరిగింది. దీపక్ కుమార్ అనే వ్యక్తి రీతాని ప్రాంతంలో నగల షాపు నిర్వహిస్తున్నాడు. బుధవారం అర్ధరాత్రి తర్వాత ఆ షాపులో చోరీకి ఇద్దరు దొంగలు ప్రయత్నించారు. షాపు సమీపంలో ఉన్న మురుగు కాలువ నుంచి 15 అడుగుల పొడవైన సొరంగం తవ్వారు. షాపులోకి ప్రవేశించి గ్యాస్ కట్టర్తో లాకర్ను కట్ చేసి తెరిచేందుకు ప్రయత్నించారు. సాధ్యం కాకపోవడంతో చోరీ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. తమను క్షమించాలంటూ ఒక నోట్ రాశారు. దానిపై చన్ను, మున్ను అని పేర్కొన్నారు.
కాగా, గురువారం ఉదయం షాపు తెరిచిన దీపక్ కుమార్ షాక్ అయ్యాడు. దొంగలు చోరీకి విఫలయత్నం చేసినట్లు గ్రహించాడు. తమ దొంగతనాన్ని దేవుడు చూడకుండా ఉండేందుకు కృష్ణుడి విగ్రహాన్ని దొంగలు గోడ వైపునకు తిప్పినట్లు తెలిపాడు. సీసీటీవీ రికార్డర్లోని హార్డ్ డిస్క్ను ఎత్తికెళ్లినట్లు చెప్పాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మరోవైపు దీపక్ ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. దొంగలు 15 అడుగుల సొరంగాన్ని చాలా రోజులుగా తవ్వుతూ ఉండవచ్చని పేర్కొన్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.