న్యూఢిల్లీ: పార్లమెంట్లో రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభమై దాదాపు 10 రోజులు కావస్తున్నా ఉభయసభల్లో వాయిదాల పర్వం కొనసాగుతున్నది. అదానీ-హిండెన్బర్గ్ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని విపక్షాలు పట్టుపడుతుండగా.. లండన్లోని కేంబ్రిడ్జి యూనివర్సిటీలో చేసిన ప్రసంగంపై రాహుల్గాంధీ క్షమాపణలు చెప్పాలని అధికారపక్ష సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
ఇవాళ ఉదయం 11 గంటలకు ఉభయసభలు ప్రారంభం కాగానే ప్రతిపక్ష ఎంపీలు అదానీ అంశంపై జేపీసీ కోసం పట్టుబట్టారు. ఆ వెంటనే అధికారపక్షం ఎంపీలు కూడా రోజులాగే రాహుల్గాంధీ స్పీచ్ అంశాన్ని లేవనెత్తారు. రాహుల్గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దాంతో అటు రాజ్యసభలో, ఇటు లోక్సభలో గందరగోళం చెలరేగింది.
లోక్సభలో స్పీకర్ ఓంబిర్లా, రాజ్యసభలో చైర్మన్ జగదీప్ ధన్కర్ సభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినిపించుకోలేదు. దాంతో ఉభయసభలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదాపడ్డాయి. ఒంటిగంటకు స్పీకర్, చైర్మన్ వేర్వేరుగా ఆల్పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసి మాట్లాడినా ఫలితం లేకుండా పోయింది. మధ్యాహ్నం రెండు గంటలకు రాజ్యసభ తిరిగి ప్రారంభం కాగానే సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. దాంతో చైర్మన్ సభను గురువారం ఉదయానికి వాయిదా వేశారు.