న్యూఢిల్లీ: ఆశావర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలకు రూ.5 లక్షల కవరేజీతో ఆయుష్మాన్ భారత్ను వర్తింపజేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ‘సాక్షమ్ అంగన్వాడీ’ పథకం కింద ఆంగన్వాడీ కేంద్రాలను ఆధునీకరిస్తామని..గర్భిణులు, పిల్లల్లో పోషకాహార లోపాన్ని తగ్గించేందుకు ‘పోషణ్ 2.0’ కార్యక్రమాన్ని అప్గ్రేడ్ చేస్తామని పేర్కొన్నారు. గర్భాశయ క్యాన్సర్ బారిన పడకుండా 9-14 ఏండ్ల బాలికలకు క్యాన్సర్ నిరోధక టీకాపై దృష్టి సారిస్తామన్నారు. మరోవైపు పిల్లల్లో రోగ నిరోధకత పెంచటానికి ‘మిషన్ ఇంద్రధనస్సు’ను నిర్వహించేందుకు ‘యు-విన్’ ప్లాట్ఫామ్ను దేశవ్యాప్తంగా విస్తరిస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు.
‘ప్రజలకు సేవ చేయాలని ఎంతో మంది యువత వైద్య వృత్తి వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలను వినియోగించుకొని మరిన్ని మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తాం’ అని నిర్మల తెలిపారు. ఇందుకోసం ఓ కమిటీని నియమిస్తామని వెల్లడించారు. ఆరోగ్య రంగానికి ఈ సారి బడ్జెట్లో రూ.90,658.63 కోట్లు కేటాయించారు. గతేడాదితో పోల్చితే ఇవి 12.59 శాతం ఎక్కువ. ఇందులో రూ.87,656.90 కోట్లు ఆరోగ్యం-కుటుంబ సంక్షేమానికి కేటాయించారు.