న్యూఢిల్లీ : ఎయిరిండియా విక్రయాన్ని పూర్తి చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు ఒడిశాకు చెందిన నీలాంచల్ ఇస్పాత్ కోసం బిడ్లను ఖరారు చేసే పనిలో నిమగ్నమై ఉన్నది. ఈ విషయాన్ని నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.
గత సంవత్సరం బడ్జెట్ గణనీయమైన పురోగతిని సాధించిందని, త్వరలోనే ఎల్ఐసీ ఐపీఓకు రానున్నదని ఆర్థిక మంత్రి చెప్పారు. ఎల్ఐసీలో ఐపీఓ ద్వారా ఉపసంహరించుకునే ప్రభుత్వ వాటా పరిమాణాన్ని నిర్ణయించే ప్రక్రియలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిపారు. మార్చి 2022 తో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎల్ఐసీ ఐపీఓ చాలా కీలకమైనది.
2021-22 బడ్జెట్లో పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం రూ.1.75 లక్షల కోట్లు కాగా, గత ఆర్థిక సంవత్సరంలో రూ.32,835 కోట్లు సేకరించారు. రూ. 1.75 లక్షల కోట్లలో రూ.1 లక్ష కోట్లు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో ప్రభుత్వ వాటాను విక్రయించడం ద్వారా రావాల్సి ఉన్నది. రూ. 75,000 కోట్లు సీపీఎస్ఈ డిజిన్వెస్ట్మెంట్ రశీదులుగా ఉంటాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్లలో మైనార్టీ వాటా విక్రయం ద్వారా రూ.9,330 కోట్లు సమీకరించారు.